చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. హిట్ వచ్చిన వెంటనే వరుస అవకాశాలు వస్తాయి. వాటిల్లో ఒకటి, రెండు ఫ్లాపులొస్తే.. వెంటనే దూరం పెట్టేస్తారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువ జరుగుతుంది. వరుస హిట్స్ ఇచ్చి.. ఒక ఫ్లాప్ వస్తే చాలు ఆమెను దూరం పెట్టి..కొత్త వాళ్లను పరిచయం చేస్తుంటారు. అందుకే హీరోయిన్లు.. అవకాశం ఉన్నప్పుడు ఎక్కువ సినిమాలు చేసేసి.. త్వరగానే కెరీర్కి గుడ్బై చెప్పేస్తుంటారు.
అయితే కొంతమంది మాత్రం అవకాశాలు ఉన్నా..పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తారు. మరికొంతమంది మాత్రం పెళ్లి అయిన తర్వాత అవకాశాలు రాకపోవడంతో మెల్లి మెల్లిగా వెండితెరకు కనుమరుగు అవుతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ని ప్రారంభించి.. హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను అలరించిన అవికా గోర్.. ఇప్పుడు సినిమాలకు గుడ్బై చెప్పింది. పెళ్లి తర్వాత అవకాశాలు రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే నటనను మాత్రం కొనసాగించబోతుంది. మళ్లీ సీరియల్స్కి రాబోతున్నట్లు తెలుస్తోంది.
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అవికా గోర్. ఆ తర్వాత తెలుగు సినిమా ‘ఉయ్యాల జంపాల’తో హీరోయిన్గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగు,హిందీ, కన్నడ చిత్రాల్లోనూ వరుస సినిమాలు చేసింది. అయితే ఆమె కెరీర్ మొత్తంలో మిడియం రేంజ్ హీరోలతో నటించే అవకాశాలు మాత్రమే వచ్చాయి. ఇప్పటి వరకు స్టార్ హీరోతో నటించలేదు. 2025లో ప్రియుడు నటుడు, వ్యాపారవేత్త మిళింద్ చద్వానీని పెళ్లి చేసుకొని..ఇటీవల బ్యాంకాక్లో స్థిరపడింది. అయితే పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని చెప్పింది. కానీ అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో మళ్లీ ఈ బ్యూటీ మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అది నిజమే అన్నట్లుగా ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
‘మన ప్రయాణం ఎక్కడ మొదలైయిందో మళ్లీ అక్కడికే చేరుకోవడం అందమైన విషయం. దీని గురించి ఎక్కువ చెప్పదల్చుకోలేదు. మనం కొత్త దారుల్లో వెళ్లినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ జీవితం అప్పుడప్పుడు మన మూలాల దగ్గరకు తీసుకెళ్తుంది. అలాఅని అది వెనక్కి తగ్టినట్లు కాదు. ఒక కొత్త కోణంలో అర్థం చేసుకునేంతగా మనం ఎదిగామాని అర్థం’ అని ఆమె ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది.
కాగా, అవికా గోర్ ఇటీవల ‘ఎస్జే స్టూడియోస్’కి వెళ్లింది. అప్పటినుంచే ఆమె కొత్త టీవీ ప్రాజెక్ట్ ప్రారంభించబోతున్నారన్న ప్రచారం మొదలైంది. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్తో అది నిజమే అన్నట్లుగా తెలిసిపోతుంది.


