
హృదయాన్ని కదిలించేలా ‘చూస్తున్నవేమో’ పాట
Mar 29 2025 5:08 PM | Updated on Mar 29 2025 5:19 PM

తల్లి సెంటిమెంట్ను ఆధారంగా చేసుకుని వచ్చిన పాటలన్నీ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయాయి. అమ్మ ప్రేమను కీర్తించే టాలీవుడ్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి మదర్ సెంటిమెంట్ను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ‘మాతృ’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్పై శ్రీ పద్మ సమర్పణలో బి. శివ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి జాన్ జక్కీ దర్శకత్వం వహించారు. ‘రా రాజా’ చిత్రంతో దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రతిభను చాటిన బి. శివ ప్రసాద్, ఇప్పుడు ‘మాతృ’ సినిమాతో తన సినీ అభిరుచిని మరోసారి ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీరామ్, నందినీ రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి. మనసును ఆకట్టుకునే లిరికల్ వీడియోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు చిత్ర బృందం. తాజాగా, తల్లి కోసం పడే వేదనను హృదయస్పర్శిగా చూపించే ‘చూస్తున్నవేమో’ అనే ఎమోషనల్ పాటను రిలీజ్ చేశారు. శేఖర్ చంద్ర స్వరకల్పన, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, కారుణ్య గాత్రంతో ఈ పాట పదే పదే వినాలనిపించేలా ఉంది. జాతీయ అవార్డు గ్రహీత అయిన సుద్దాల అశోక్ తేజ రాసిన సాహిత్యం గుండెల్ని పిండేసేలా ఉండగా, కారుణ్య గొంతులోని ఆర్ద్రత శ్రోతలను భావోద్వేగంతో నింపుతోంది.
ఈ అద్భుతమైన పాటను ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా ప్రశంసించారు. హృదయాన్ని తడమగలిగిన ఈ పాటను మెచ్చుకుంటూ, ప్రస్తుత కాలంలో మదర్ సెంటిమెంట్పై సినిమాలు లేదా తల్లి ప్రేమను చాటే పాటలు అరుదుగా వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మాతృ’ టీంను అభినందిస్తూ, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement
Advertisement