నటి కృషితా పండ ఇంట్లో జరిగిన వ్యాపారవేత్త వైశాక్ ఆత్మహత్యకేసు దర్యాప్తును రాజరాజేశ్వరినగర పోలీసులు తీవ్రతరం చేశారు. ఆత్మహత్య ఘటన అనంతరం మృతదేహాన్ని శవపరీక్షలకు తరలించిన పోలీసులు కృషితా పండను విచారణ చేపట్టారు. తాను మూడురోజుల పాటు బయటవెళ్లానని, 24 తేదీ రాత్రి 11 గంటలకు ప్లాట్కు వచ్చినప్పడు డోర్లాక్ అయిందని తెలిపారు.
ప్లాట్కు రెండు తాళాలు ఉండగా ఒకటి వైశాక్ వద్ద, మరొకటి తన వద్ద ఉందన్నారు. దానితో డోర్ లాక్ తీసి లోపలకు వెళ్లగా వైశాక్ చీరతో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడని పేర్కొంది. చీర కత్తిరించి మృతదేహాన్ని కిందికి దించానని తెలిపింది. అనంతరం పోలీసులకు, వైశాక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించానని ఆమె విచారణలో పేర్కొన్నారు.
కాల్డేటా పరిశీలన
పోలీసులు కృషితా పండ మొబైల్ను పరిశీలించారు. మెసేజ్లు, కాల్లిస్ట్, వాట్సాప్చాటింగ్స్ను పరిశీలించారు. ఎలాంటి అనుమానాస్పద అంశాలు లేకపోవడంతో వాంగ్మూలం నమోదు చేసుకుని మొబైల్ ఇచ్చేశారు.
ఆత్మహత్యకు కారణం గుర్తించండి
కాగా ఈ కేసుకు సంబంధించి వైశాక్ భార్య మేఘనా రాజరాజేశ్వరినగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వైశాక్ ఆత్మహత్య గురించి ఎవరిపైనా అనుమానం లేదని, కానీ ఆత్మహత్మకు దారి తీసిన కారణం ఆచూకీకనిపెట్టాలని మేఘనా మనవి చేసింది.


