పోర్చుగల్లో భారత సంతతి వ్యాపారవేత్తపై కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. పోర్చుగల్లోని ఒడివెలస్ (Odivelas) ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యాపారవేత్తను కిషోర్ గుజరాతీగా గుర్తించారు. దీనికి తోడు 'ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, అక్కడే నిన్ను చంపేస్తాం', అంటూ కాల్పుల తర్వాత ఒక గ్యాంగ్స్టర్ బెదిరింపు వీడియో మరింత సంచలనం రేపుతోంది. అయితే, ఈ దాడి వెనుకున్నకారణాలేంటి, బెదిరించిన గ్యాంగులు ఎవరు అనేది తెలియరాలేదు.
సోషల్ మీడియాలో ఈ దాడికి సంబంధించి పలు రకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికీ, స్థానిక అధికారులు మాత్రం నేరస్థ ముఠాలతో సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు కనుగొనలేదు. అయితే ఈ దాడి జరిగిన కొద్దిసేపటికే, ఫేస్బుక్లో ‘రాహుల్ ఆర్కే మీనా’ అనే అకౌంట్ నుండి ఈ కాల్పుల బాధ్యతను తామే తీసుకుంటున్నట్లు ఒక పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే, ఈ సోషల్ మీడియా ఖాతాను, దాని విశ్వసనీయతను లేదా ఆ పోస్టులోని నిజానిజాలనుగానీ ఇంకా ఎవరూ ధృవీకరించలేదు.
ఆ పోస్టులో ఇలా ఉంది: నా సోదరులందరికీ నమస్కారాలు. ఈ రోజు పోర్చుగల్లోని సిడేడ్ నోవా ఒడివెలస్ సమీపంలో కిషోర్ గుజరాతీపై జరిగిన కాల్పుల బాధ్యతను రాహుల్ ఆర్కే మీనా అనే నేను స్వీకరిస్తున్నాను. మా మెసేజేస్ని నిర్లక్ష్యం చేయడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే." అంటూ ఒక సంచలన పోస్ట్పెట్టాడు.అంతటితో ఆగకుండా, ఆ పోస్టులో మరిన్ని హెచ్చరికలు కూడా జారీ చేశాడు.
"మేము ఎవరికైతే ఫోన్లు/సందేశాలు పంపామో.. వారంతా సిద్ధంగా ఉండండి. ఏ క్షణంలోనైనా మీ శరీరాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్ల వచ్చు. అవకాశం దొరికిన వెంటనే దాడి చేస్తాం. నేను అందరితోనూ లెక్కలు తేలుస్తాను. మా పరిధి, ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. సరైన సమయం కోసం వేచి ఉండండి. మా తదుపరి దాడి దీనికంటే చాలా దారుణంగా ఉంటుంది!"అంతేకాకుండా, ఆ పోస్టులో భారతదేశానికి చెందిన కొన్ని నేరపూరిత ముఠాలైన 'సునీల్ మీనా గ్యాంగ్', 'అమన్ సాహు గ్యాంగ్' పేర్లను కూడా ప్రస్తావించడం గమనార్హం.
ఇదీ చదవండి: 30 ఏళ్ల నమ్మకం ఖరీదు రూ. 97 లక్షలు : నట్టేట ముంచేశాడు
పోర్చుగల్ అధికారులు ఈ సోషల్ మీడియా పోస్టుల విశ్వసనీయతను ఇంకా ధృవీకరించలేదు. అలాగే ఈ దాడికి, అంతర్జాతీయ నేర ముఠాలకు మధ్య ఎటువంటి సంబంధం ఉందనే దానిపై విచారణ జరుగుతోంది. బాధ్యత వహిస్తూ సదరు వ్యక్తి విడుదల చేసినట్లు చెబుతున్న ఒక వీడియోతో పాటు ఆన్లైన్ కంటెంట్ను కూడా అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా డిజిటల్ ఆధారాలు, ఘటనా స్థలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ , ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలను విశ్లేషిస్తున్నారు. ఈ దాడికి గల అసలు కారణాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. దర్యాప్తు కొనసాగుతున్నందున సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను, ధృవీకరించని సమాచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరారు.
ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం పోయింది : నేడు రోజుకు రూ. 50 వేల టర్నోవర్


