‘‘కొత్త మలుపు’లో కుటుంబ భావోద్వేగాలు, వినోదం, కామెడీ, సస్పెన్స్ వంటి అన్ని వాణిజ్య అంశాలున్నాయి. యువతరానికే కాదు... కుటుంబ ప్రేక్షకులకూ మా చిత్రం నచ్చుతుంది’’ అని భైరవి ఆర్థ్యా అన్నారు. గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన చిత్రం ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నేడు(జూన్12) విడుదల చేస్తోంది.
ఈ నేపథ్యంలో బుధవారం హీరోయిన్ భైరవి ఆర్థ్యా విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కొత్త మలుపు’లో నా పాత్ర పేరు వరలక్ష్మి. కోనసీమకు చెందిన అమాయకమైన గ్రామీణ యువతి తను. చాలా స్వేచ్ఛగా, మనసుకు నచ్చినట్టు జీవించే అమ్మాయి. ఈ సినిమా కోసం నాకు భాషే పెద్ద సవాలుగా మారింది. తెలుగు నేర్చుకున్నప్పటికీ గోదావరి ప్రాంత యాసను పట్టుకోవడం అంత సులభం కాదు.
అలాగే వర్షాకాలంలో షూటింగ్ జరగడంతో వాతావరణ పరిస్థితులు కూడా కొంత ఇబ్బంది కలిగించాయి. అయితే టీమ్ అందరి సహకారంతో ఆ సవాళ్లను అధిగమించగలిగాను.ఇక మంచి కథ, పాత్ర బాగుంటే సినిమా అయినా, ఓటీటీ ప్రాజెక్ట్ అయినా నటించేందుకు నేను సిద్ధమే,నా తల్లిదండ్రులు గర్వపడేలా చేయడం నా లక్ష్య’అని పేర్కొన్నారు.


