‘‘లెనిన్’ సినిమా విజయం నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. నేను చేసిన భారతి పాత్ర పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ జీవితాంతం మర్చిపోలేను. ‘లెనిన్’లో నా నటన పట్ల మా అమ్మానాన్నలు చాలా సంతోషంగా ఉన్నారు. మా అమ్మగారు నాకు ఫోన్ చేసి, ‘సినిమా చాలా బాగుంది.. నీ నటన కూడా ఎంతో బాగా అనిపించింది’ అన్నారు.
అయితే భారతి పాత్ర ముగింపు చూసి ఒక తల్లిగా చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే అలాంటి ముగింపును ఏ తల్లి కూడా కోరుకోదు కదా?’’ అని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పేర్కొన్నారు. అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ అయింది. ఈ చిత్రంలో భారతి పాత్ర పోషించిన భాగ్యశ్రీ బోర్సే చెప్పిన విశేషాలు...
⇒ ‘‘లెనిన్’ కథని మురళీ కిషోర్గారు చెప్పినప్పుడే నా మనసుకు హత్తుకుంది. భారతి పాత్రలో నటనకు మంచి అవకాశం ఉందని అప్పుడే అనిపించింది. ఇప్పుడు ప్రేక్షకులు ఆ పాత్రను ఇంతగా అభిమానించడం చాలా సంతోషంగా ఉంది. భారతి పాత్ర గురించి అందరూ ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు. నాగార్జునగారు నా నటన గురించి మాట్లాడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ ప్రశంసలు నాకు సంతోషంతో పాటు మరింత బాధ్యతను కూడా పెంచాయి.
⇒ ఋలెనిన్–భారతిల ప్రేమకథే ‘లెనిన్’. అఖిల్, నా పాత్రలు తెరపై చాలా సహజంగా కనిపించేలా ప్రతి సన్నివేశంపై ఎంతో శ్రద్ధ పెట్టి పనిచేశాం. భవిష్యత్తులో మహారాణి, యువరాణి వంటి పాత్రలు చేయాలని ఉంది. అలాంటి చిత్రాల విషయంలో రాజమౌళిగారు మాస్టర్. ఏదో ఒక రోజు ఆయన దర్శకత్వంలో నటించాలని ఉంది. ‘మా ఇంటి బంగారం’ సినిమాలో సమంతగారు అద్భుతంగా నటించారు. మాలాంటి కొత్త నటీమణులకు ఆమె ఒక దారి చూపించారు. అవకాశం వస్తే అలాంటి మహిళా ప్రధాన పాత్రలు కూడా చేయాలని ఉంది. ప్రస్తుతం శివ కార్తికేయన్ తో తమిళంలో ‘సీయోన్’ సినిమా చేస్తున్నాను. అలాగే తెలుగు, తమిళ భాషల్లో మరికొన్ని కథలు వింటున్నాను. వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను.


