కోలీవుడ్లో ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రాల్లో అరసన్ ఒకటి. దీనికి కారణం నటుడు శింబు కథా నాయకుడుగా నటిస్తుండడమే. ఆయనతోపాటు విజయ్ సేతుపతి, ఆండ్రియా, యోగిబాబు, సముద్రఖని, విక్రాంత్, కిషోర్, అమీర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కలైపులి ఎస్ ధాను తన వీ.క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రం ఇది.
దీనికి వెట్రిమారన్ కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇది ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే గ్యాంగ్ స్టర్స్ కథా చిత్రమని సమాచారం. ఇందులో నటుడు శింబు రెండు గెటప్పుల్లో కనిపించనున్నారు. చిత్రం షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకుందని తెలిసింది. ఇందులో నటి ఆండ్రియా చిన్న వయసులో శింబుకు తల్లిగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దీనిపై స్పందించిన ఆమె అరసన్ చిత్రంలో తాను నటుడు శింబుకు తల్లిగా నటిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఈ చిత్రంలో చంద్ర అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ఇందులో తన పాత్ర చాలా వైవిధ్య భరితంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈమె ఇంతకు ముందు ధనుష్ హీరోగా నటించిన వడచైన్నె చిత్రంలోనూ చంద్ర అనే పాత్రలోనే నటించారన్నది గమనార్హం.


