సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు సామాజిక అంశాలపైనా ఆమె తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తుంటారు. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ వీడియోలో మహిళలపై కొనసాగుతున్న కొన్ని సంప్రదాయాల గురించి ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా భర్త చనిపోయిన తర్వాత మహిళలు బొట్టు, గాజులు, గజ్జెలు వంటి వాటిని ఎందుకు తీసేయాలనే అంశంపై తన ఆలోచనలను పంచుకున్నారు.
వీడియోలో అనసూయ ఇలా మాట్లాడారు.‘ఒక ఆలోచన మూడేళ్ల నుంచి నన్ను తినేస్తోంది. మూడేళ్ల క్రితం మా నాన్న చనిపోయారు. మా అమ్మ చాలా అందంగా ఉంటుంది. బొట్టు పెట్టుకుని, మంచి రంగు గాజులు, గజ్జెలు ధరించి చాలా అందంగా రెడీ అయ్యేది. కానీ నాన్నగారు చనిపోయిన అవన్నీ అమ్మకు దూరమయ్యాయి.మనకు బొట్టు, కాటుక, గాజులు, గజ్జెలు ఇవన్నీ ఎవరు పరిచయం చేశారు? మా అమ్మకు మా అమ్మమ్మ.. నాకు మా అమ్మ.
అలాగే గోరింటాకు పెట్టుకోవడం, నెయిల్ పాలిష్ వేసుకోవడం వంటి వాటిని కూడా మనకు పెళ్లికి ముందే అమ్మలు, అమ్మమ్మలు పరిచయం చేశారు. అలాంటప్పుడు వాటిని పెళ్లితో ఎందుకు ముడిపెట్టాలి? భర్త చనిపోగానే బొట్టు, గాజులు, గజ్జెలు ఎందుకు తీసేయాలి? అలా ఎక్కడ రాసి ఉంది? ఒకవేళ ఇవన్నీ పెట్టుకోవద్దని అనుకుంటే.. అమ్మమ్మ చనిపోయినప్పుడే అమ్మ కూడా వాటిని మానేయాలి కదా. అది పర్సనల్ చాయిస్లా ఉండాలి.
ఇది నా ఆలోచన మాత్రమే.నేను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన విధంగా జీవించే స్వేచ్ఛ ఉండాలి. ఒక మహిళ బొట్టు పెట్టుకోవాలా? వద్దా? గాజులు ధరించాలా? వద్దా? అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయంగా ఉండాలి’అని అనసూయ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.


