అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఫాంటసీ అండ్ యాక్షన్ సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీపికా పదుకొనె, మలయాళ నటి ఫెమినాజార్జ్ ఈ మూవీలో భాగమయ్యారు. జాన్వీ కపూర్, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ సైతం ‘రాకా’లో నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది.
ముంబైలో జూలైలో ప్రారంభం కాబోయే కొత్త షూటింగ్ షెడ్యూల్లో రష్మిక మందన్నా జాయిన్ అవుతారని, ఆమె పాత్రకు సంబంధించి తొలుత యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు అట్లీ సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. అంతేకాదు.. రష్మిక క్యారెక్టరైజేషన్ లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, సరికొత్త గెటప్లో ఆమె కనిపిస్తారని తెలిసింది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘రాకా’ సినిమా 2027లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ‘మైసా’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు రష్మిక. అలాగే విజయ్ దేవరకొండ సరసన ‘రణబాలి’ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.


