ఇక్కడే ఇంజినీరింగ్‌ కళాశాలలో చదివాను: నాగార్జున | Akkineni Nagarjuna Comments On With Chennai Bonding | Sakshi
Sakshi News home page

ఇక్కడే ఇంజినీరింగ్‌ కళాశాలలో చదివాను: నాగార్జున

Jun 3 2025 7:10 AM | Updated on Jun 3 2025 9:52 AM

Akkineni Nagarjuna Comments On With Chennai Bonding

ధనుష్,  నాగార్జున, నటి రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ద్విభాషా (తమిళం, తెలుగు) చిత్రం కుబేర( Kuberaa). శ్రీవెంకటేశ్వర ఫిలింస్, అమిగోస్‌ క్రియేషన్స్‌ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 20వ తేదీన తమిళం, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ఒక ప్రైవేట్‌ కళాశాలలో నిర్వహించారు. ఈ వేడుకలో నటుడు ధనుష్‌, నాగార్జున, రష్మిక మందన్నా, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, దర్శకుడు శేఖర్‌ కమ్ములతో పాటు  పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నటి రష్మిక మందన్న( Rashmika Mandanna) మాట్లాడుతూ తనను ఈ చిత్రంలోకి ఆహ్వానించినందుకు దర్శకుడు శేఖర్‌ కమ్ములకు కృతజ్ఞతలు తెలిపారు. నటుడు ధనుష్‌తో మళ్లీ కలిసి నటించాలని కోరుకుంటున్నాననీ, అయితే ఈ సారి పూర్తి ప్రేమ కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, గీత రచయిత తదితర బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడు ధనుష్‌ అంటూ ప్రశంసించారు. కుబేర అద్భుతమైన చిత్రం అని పేర్కొన్నారు. 

నటుడు నాగార్జున(Akkineni Nagarjuna) మాట్లాడుతూ అడయార్‌లో పుట్టి, గిండీలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో చదివి, చెన్నైకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే జీవితాన్ని ప్రారంభించానని పేర్కొన్నారు. చెన్నై ప్రేక్షకులు తనకు అందిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని అన్నారు. కుబేర చిత్రం తరువాత రజనీకాంత్‌తో కలిసి నటించిన కూలీ చిత్రం ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించడానికి ఎదురు చూస్తోందని నాగార్జున పేర్కొన్నారు. 

నటుడు ధనుష్‌(Dhanush) మాట్లాడుతూ ఇది కలికాలం అనీ, వ్యతిరేకత, అసూయ పడేవారి కాలం అనీ, చెడు మంచి కంటే పెట్రేగిపోతోందని అన్నారు. పరలోకం నుంచి వచ్చిన దేవత మాదిరి స్వచ్ఛమైన మనసు కలిగిన దర్శకుడు శేఖర్‌ కమ్ములతో కలిసి పని చేసే అవకాశం కలిగినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాతలు సునీల్‌ నారంగ్, జాన్వీ నారంగ్‌ కథపై అపార నమ్మకంతో ఈ చిత్రాన్ని బ్రహా్మండంగా నిర్మించారని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement