ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని ఆదివారం భారతీయ సినీ డైరెక్టర్ రాధాకృష్ణ సందర్శించారు. ఆయన జన్మదినం సందర్భంగా అభయాంజనేయస్వామిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు శేషవస్త్రాలతో సత్కరించగా, అర్చకులు సందీప్చారి తీర్థ ప్రసాదాలను అందించి, ఆలయ చరిత్ర గురించి ఆయనకు వివరించారు. ఆయన వెంట సినీ ఆర్టిస్టులు, ఆలయ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
టైరు పేలి కారు బోల్తా.. తప్పిన పెను ప్రమాదం
ఎర్రవల్లి: జాతీయ రహదారిపై టైరు పేలి కారు బోల్తాపడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కర్నూల్కు చెందిన అబ్దుల్లా తమ తొమ్మిది మంది కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై కొట్టం కాలేజీ సమీపంలోకి రాగానే టైరు పేలడంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అబ్దుల్లాతో పాటు భార్య ముంతాజీబేగం కు తీవ్రగాయాలు కాగా మిగిలిన ఎనిమిది మంది చిన్న గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు, వాహనదారులు హుటాహుటిన కారు వద్దకు చేరుకొని క్షతగాత్రులను బయటికి తీసి చికిత్స నిమిత్తం వారిని కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో ఒకే కుటుంబానికి చెందిన మొత్తం పది మంది (ఐదుగురు పెద్దలు, ఐదుగురు చిన్నారులు) ఉన్నా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నట్లు తెలిపారు.
పాముకాటుకు రైతు బలి
అమరచింత: చెరుకు తోటలో బోరుమోటార్ సరిచేస్తున్న సమయంలో పాముకాటు వేయడంతో రైతు మృతి చెందిన ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మండలంలోని సింగంపేట గ్రామానికి చెందిన చిన్నఆంజనేయులు(50) తెల్లవారు జామున చెరుకు తోటలో బోరు మోటార్ వద్ద ఫీజులు సరిచేస్తుండగా పాముకాటుకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాచారం అందించగా ఆత్మకూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య సువర్ణ, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


