ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన వాహనాలతో ప్రాజెక్టు రహదారిపై ట్రాఫిక్ జాం ఏర్పడి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఓ పక్క ఆదివారం సెలవు కా వడం.. మరో పక్క కృష్ణానదికి మొదటిసారిగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు జిల్లా స్థానికులతో పాటు ఆయా జిల్లాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కృష్ణమ్మ పొంగులను తిలకించి తరలించి పో యారు. కుటుంబ సమేతంగా.. మరో పక్క స్నేహితుల దినోత్సవం కావడంతో యువత పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సంతోషంగా గడిపారు. అనంతరం ప్రాజెక్టుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన చేపల వంటకాల వద్ద జన సందోహం కనిపించింది. ట్రాఫిక్ నియంత్రిచడంలో పోలీసులు విఫలమైనట్లుగా కనిపించింది. ట్రాఫిక్ జాంతో వాహనదారులు, ప్రజలు కళ్ల ముందు ఇబ్బందులు పడుతుంటే ఓ పోలీసు సిబ్బంది సెల్ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు. అతడి తీరుపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.


