కల్వకుర్తి రూరల్ : శ్రీకృష్ణ కాలచక్రం 91వ విశ్వశాంతి మహాయాగంలో భాగంగా ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, అనురాధ దంపతులు చండీ హోమంలో పాల్గొన్నారు. మొదట యాగశాల ప్రదక్షణ చేసి యాగం అనంతరం స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళి సుఖశాంతులతో జీవించాలని సంకల్పంతో ఉద్దేశంతో నిర్వహించిన ఈ మహాయాగం సత్ఫలితాలు ఇస్తుందన్నారు. మానవసేవే మాధవసేవని.. మానవాళి మేలు కోసం చేస్తున్న యాగంలో తాము భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. దైవకృప అందరికి లభించాలని, భక్తి భావాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్దన్రెడ్డి మాట్లాడుతూ.. సర్వేజనా సుఖినోభవంతు అని భావించడం ఒక హైందవ ధర్మంలోనే ఉందన్నారు. పిల్లలకు సాంప్రదాయాలు, సంస్కృతిని, దైవ భావాన్ని పెంపొందించే కార్యక్రమాలను రూపొందించాలని, తాము ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఉదయం సూర్య, శ్రీరామ, శ్రీచండీ హోమం, శ్రీసుదర్శన లక్ష్మీనారాయణ రుద్రహోమం, సహస్ర కళాశాభిషేకం, సీతారామచంద్రస్వామికి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాదాపు పదివేల మందికి అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్కుమార్, కాయతి విజయకుమార్రెడ్డి, మిరియాల శ్రీనివాస్రెడ్డి, జూలూరు రమేష్బాబు, బీచని బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


