అయిజ: తమకు నకిలీ వేరుశనగ విత్తనాలు కట్టబెట్టి వ్యాపారి నిలువునా మోసం చేశారని ఆరోపిస్తూ రైతులు గురువారం పట్టణంలోని దుకాణం ఎదుట పంట మొక్కలు పట్టుకొని నిరసన తెలిపారు. బాధిత రైతులు తెలిపిన వివరాలు.. మున్సిపాలిటీ పరిధిలోని పర్ధిపురం గ్రామానికి చెందిన తిమ్మప్పగౌడ్ అయిజ మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ తిరుమలేష్ దుకాణంలో వేరుశనగ పంట సాగు చేసేందుకు 2 ఎకరాలకు సరిపడా విత్తనాలు కొనుగోలు చేశాడు. సుమారు రూ.1.30 లక్షలు పెట్టుబడి పెట్టామని, మొక్కలకు వేరుశనగ కాయలు తక్కువగా ఉండి దిగుబడి పడిపోయిందని వాపోయారు. ఎకరాకు 40 బస్తాలు దిగుబడి రావాల్సి ఉండగా.. కేవలం 5 బస్తాలే వచ్చిందన్నారు. వ్యాపారి నకిలీ విత్తనాలు విక్రయించడంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని రైతు కుంటుంబ సభ్యులు తిమ్మప్పగౌడ్, సువర్ణ, మహేంద్రగౌడ్ దుకాణం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై విత్తన విక్రయదారుడు తిరుమలేష్ను వివరణ కోరగా.. ఆ రైతుకు నేను విత్తనాలు విక్రయించలేదన్నారు. రైతులు, వేరుశనగ విక్రయదారుడు ఒకరిపై మరొకరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.


