భూగర్భ జలం.. ఇంకితేనే ప్రతిఫలం | - | Sakshi
Sakshi News home page

భూగర్భ జలం.. ఇంకితేనే ప్రతిఫలం

Jul 31 2026 12:39 AM | Updated on Jul 31 2026 12:39 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌)/నర్వ: ఎల్‌నినో ప్రభావంతో వానలు పడక.. పల్లెలు, పట్టణాలు ఆకాశం వైపు చూస్తున్నాయి. సమీప భవిష్యత్‌లో ఇలాంటి ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు మేల్కొన్నాయి. నీటి సంరక్షణతోపాటు భూగర్భజలాల పెంపునకు ప్రతి చుక్క– ప్రజల కోసం నినాదంతో ‘జలసిరిశ్రీకి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం వీబీ జీ రాంజీ పథకంలో ఇళ్ల వద్ద వ్యక్తిగత, గ్రామాల్లో సామూహిక ఇంకుడు గుంతలు, బోర్‌వెల్‌ రీచార్జి కుంట, ఓపెన్‌ వెల్‌, పొలాల్లో నీటికుంటల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3.9 లక్షల ఇంకుడు గుంతలు, 6,776 పాంపాండ్ల నిర్మాణం.. ఆగస్టు 14 వరకు పూర్తిచేసేలా అధికారులు లక్ష్యం నిర్దేశించారు. ఇంటికో ఇంకుడు గుంత.. పొలానికో పంట కుంట.. గ్రామానికి ఊటకుంట అనే నినాదంతో జలసిరి కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేసింది.

నిర్మాణంలో పాటించాల్సినవి..

శాసీ్త్రయంగా ఇంటి పైకప్పు నుంచి 50 చదరపు అడుగుల వైశాల్యంలో వర్షపు నీరు పడి ఒక్క ఇంకుడు గుంత ద్వారా 25 వేల లీటర్ల నీటిని భూమిలో నిల్వ చేసుకోవచ్చు. ఇంకుడు గుంత ఏర్పాటును తమకు నచ్చినట్లుగా కాకుండా.. శాసీ్త్రయంగా నిర్మిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటి పైకప్పును బట్టి ఇంకుడు గుంత పొడవు, వెడల్పు నిర్ణయించుకోవాలని, ఇంటి వృథా నీరు ఇందులో చేరేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇంకుడు గుంత 4 అడుగుల పొడవు, 6 అడుగుల లోతున ఉండాలి. మూడు అడుగుల కింద భాగాన్ని పెద్ద, పెద్ద రాళ్లతో నింపాలి. ఒక సిమెంట్‌ గొళ్లెం తీసుకొని పైభాగంలో సరిపడా రంద్రాలు ఏర్పాటు చేసి గుంత మధ్య భాగంలో అమర్చాలి. ఇక గుంతలో మిగిలిన ఖాళీ భాగాన్ని మూడు ఫీట్లు (45ఎంఎం) కంకర నింపాలి. వృథాగా పారే వర్షపు నీటిని పైపు ద్వారా గొళ్లెంలోకి వెళ్లేలా చూసుకోవాలి.

సామూహిక ఇంకుడు గుంతలు

గ్రామాల్లో ప్రతి ఇంటి ఆవరణలో వ్యక్తిగత ఇంకుడుగుంత నిర్మాణం చేపట్టాలి. ఈ నిర్మాణం వీలుకాని చోట సామూహిక ఇంకుడుగుంతల నిర్మాణం చేసుకోవచ్చు. వాటి నిర్మాణం కోసం ప్రభుత్వం నిర్దిష్ట కొలతలు రూపొందించింది. పరిమాణం 1.2 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పుతో 1.8 మీటర్ల లోతు ఉండాలి. నిర్మాణ వ్యయంగా రూ.7,500 ప్రభుత్వం అందిస్తుంది. సామూహిక ఇంకుడుగుంత నిర్మాణం కోసం పొడవు, వెడల్పు 2.4 మీటర్లు, లోతు 2 మీటర్లు ఉండాలి. నిర్మాణం వ్యయం రూ.13 వేలుగా నిర్ణయించింది.

గ్రామానికో ఊటకుంట

ప్రతి గ్రామంలో ఒక ఊటకుంట తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గ్రామ నీటి అవసరాల కోసం భూగర్భ జలాలను పెంపొందించడమే ప్రధాన ఉద్దేశం. ఊటకుంట నిర్మాణం కోసం రూ.5 లక్షల నిధులు ప్రభుత్వం కేటాయించనుంది. అలాగే వ్యవసాయ అవసరాలు బోరు బావుల రీచార్జి కోసం రూ.25 వేలు మంజూరు చేయనుంది. వ్యవసాయ అవసరాల కోసం బావులు తవ్వుకోవడానికి సైతం రూ.3.50 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది.

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా ప్రభుత్వం కార్యాచరణ

ఇంటికో గుంత, పంటకో కుంట, గ్రామానికి ఊటకుంట

నిర్మాణానికి చర్యలు

ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

ఆగస్టు 14 నాటికి పూర్తి చేసేలా

గడువు విధింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement