● కూతురి వద్దకు వెళ్తుండగా ఘటన
● వర్షాకాలంలో రైల్వే అండర్ బ్రిడ్జి
పైప్లైన్ పనులు
● హైడ్రా, సీఎంసీ, పోలీస్ బృందాల గాలింపు
చందానగర్: కూతురు దగ్గరకు వెళ్లి వస్తా అని చెప్పివెళ్లిన ఓ వృద్ధుడు నాలా పైప్లైన్లో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన కొండాపూర్ డివిజన్ ప్రేమ్నగర్ బి బ్లాక్ వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి కింద జరిగింది. బంధువులు, స్థానికులు తెలిపిన మేరకు.. మహబూబ్నగర్కు చెందిన బాలయ్య (70), భార్య పద్మ ఇద్దరు కుమారులు శ్రీను, బాలస్వామి, కూతురు మంజులతో కలిసి న్యూ హఫీజ్పేటలోని ప్రేమ్నగర్లో స్థిరపడ్డారు. బాలయ్యకు కంటిచూపు మందగించి రాత్రి సమయాలలో ఇంటి నుంచి బయటకు వెళ్లేవాడు కాదు. కూతురు మంజుల వైశాలీనగర్లో నివాసముంటోంది. మంగళవారం సాయంత్రం బాలయ్య కూతురు దగ్గరకు వెళ్లి వస్తానని చెప్పి వైశాలీనగర్ వైపు బయలుదేరాడు. రైల్వే అండర్ బ్రిడ్జి పైప్లైన్ పనులు నిర్వహిస్తున్న నేపథ్యంలో భారీ వర్షం కురుస్తున్న సందర్భంగా రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద బాలయ్య ఒక్కసారిగా పాత పైప్లైన్లోకి జారి పడిపోయాడు. అప్పటికే భారీ వరదతో ప్రవహిస్తున్న పైప్లైన్లో పడి గల్లంతయ్యాడు. స్థానికులు గమనించి 100కి ఫోన్ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం హైడ్రా, సీఎంసీ అధికారులకు సమాచారం అందించారు. రాత్రి సమయం కావడం ఒకవైపు భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో పైప్లైన్లో పడ్డ వృద్ధుడి కోసం గాలింపునకు అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయం నుంచి హైడ్రా, సీఎంసీ ఉన్నతాధికారులు పరిశీలించారు. సాయంత్రం వరకు రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి ఈర్ల చెరువు వరకు వృద్ధుడి కోసం గాలించారు.


