మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టుప్రాంతాలు రామయ్యబౌలి, బీకేరెడ్డి కాలనీ, శేషాద్రినగర్, నాగిరెడ్డి కాలనీ, బీఎన్రెడ్డి కాలనీ, గచ్చిబౌలి, రాయచూర్ రోడ్డు, గౌడ్స్కాలనీ, గణేష్నగర్, వన్టౌన్లోని మహిళా పోలీస్స్టేషన్ ప్రాంగణం, వల్లభ్నగర్, కిసాన్నగర్, కుర్విహినిశెట్టికాలనీ, లక్ష్మీనగర్కాలనీ, వేంకటేశ్వరకాలనీ తదితర ప్రాంతాలతో పాటు కొత్త బస్టాండు ప్రాంగణం జలమయంగా మారాయి. చాలా చోట్ల డ్రెయినేజీలు పొంగి రోడ్లపైకి వర్షపునీటితో పాటు మురుగు ఏరులై పారింది. బస్టాండులో ప్రయాణికులతో పాటు నగరంలోని ప్రధాన రహదారుల్లో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, పలుసార్లు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇక 12 విలీన గ్రామాల్లో మట్టిరోడ్లన్నీ బురదమయంగా తయారైంది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా నగరంలో 41.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. పది మండలాల్లో పది మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. కోయిలకొండ, గండేడ్, జడ్చర్ల, రాజాపూర్, నవాబుపేట, మహమ్మదాబాద్, బాలానగర్లో ముసురుతో కూడిన జల్లులకు పడ్డాయి.


