అలంపూర్: శక్తిపీఠంలో సోమవారం నిర్వహించిన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల హుండీ లెక్కింపులో చిత్ర విచిత్ర ఘటనలు వెలుగు చూశాయి. హుండీ కానుకలను లెక్కిస్తున్న అధికారులకు ఓ లేఖ లభించింది. అందులో ఇలా ఉంది ‘‘ఉన్నత విద్య పూర్తిచేశా. ఎన్నో ప్రయత్నాలు చేసినా ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదు.. నీ చల్లని చూపుతో నాకు ఉద్యోగం వచ్చేట్టు చూడమ్మా’’ అంటూ లేఖలో పేర్కొన్నారు. బయోడెటాను జతచేసి హుండీలో వేసిన లేఖ వెలుగు చూడటంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అలాగే సేవ పేరుతో హుండీ లెక్కింపునకు వచ్చిన ఓ మహిళ చేతివాటం ప్రదర్శించడం స్థానికంగా కలకలం రేపింది. హుండీ లెక్కింపులో సదరు మహిళ రెండు, మూడు సార్లు బయటికి వెళ్లి రావడం సిబ్బంది గమనించారు. అనుమానం వచ్చిన సిబ్బంది ఈఓ దీప్తికి సమాచారం అందించి తనిఖీలు చేపట్టారు. ఆమె వద్ద రూ. 12వేల విలువ గల రూ. 500 నోట్లను గుర్తించినట్లు పేర్కొన్నారు. దేవుడి హుండీ లెక్కింపులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయమై ఆలయ ఈఓ దీప్తి మాట్లాడుతూ.. మహిళ వద్ద ఉన్న డబ్బులను రికవరీ చేసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు చేపడుతామన్నారు. హుండీ లేక్కింపులో భక్తులు డబ్బులు, బంగారం, వెండితోపాటు విదేశీ కరెన్సీ సైతం వేసి తమ మొక్కులు తీర్చుకున్నారు.


