మన్ననూర్: శ్రీశైలం, హైదరాబాద్ ప్రధాన రహదారికి అనుసరించి ఉన్న వటువర్లపల్లి గ్రామస్తులకు పునరావాసం పేరుతో గ్రామ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మన్ననూర్లో అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణను గ్రామస్తులు కలిసి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. గ్రామానికి బతుకుదెరువు కోసం వచ్చిన కొందరు ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా ఇతర పట్టణాలకు గతంలోనే తరలివెళ్లినా.. మరికొందరు తప్పుడు ఆధార్, రేషన్ కార్డులను సంపాదించుకుని పునరావాసం కోరుతున్నారని వారు ఆరోపించారు. వటువర్లపల్లిలో పుట్టి పెరిగి దశాబ్దాల కాలంగా ఇక్కడే జీవిస్తున్న ఏ ఒక్కరూ పునరావాసం కోరుకోవడం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. గ్రామంలో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మంజూరైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొందరు అడ్డుకోవడం సరికాదన్నారు. ఇప్పటికై నా గ్రామంలోనే నివాసం ఉంటామని కోరుకుంటున్న అర్హులైన వారసత్వ కుటుంబాల మనుగడ కోసం అభివృద్ధి పథకాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వటువర్లపల్లి మాజీ సర్పంచులు సర్యనాయక్, చత్రునాయక్, గ్రామస్తులు వెంకటపతి, అనిల్కుమార్, ప్రభాకర్, రమేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


