జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు), యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ట్రిపుల్ ఐటీ, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలు, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో వివిధ పథకాల కింద మంజూరైన భవన నిర్మాణ పనులు, అదనపు తరగతి గదులు, సైన్న్స్ ల్యాబ్లు, లైబ్రరీ, కిచెన్, మరుగుదొడ్ల, ప్రహరీ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో కేజీబీవీ ప్రత్యేక అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, పంచాయతీరాజ్, విద్య సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థ ఇంజినీరింగ్ శాఖ ఏఈలు, డీఈలు, ఈఈలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యాసంస్థలలో జరుగుతున్న సివిల్ నిర్మాణ పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ఆరా తీశారు. పనుల పురోగతిని ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అవసరమైతే కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చి అదనపు కార్మికులను ఏర్పాటు చేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కేజీబీవీలలో, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాబార్డ్, పీఎంశ్రీ, అమ్మ ఆదర్శ పాఠశాల పథకాల ద్వారా మంజూరైన అన్ని చిన్న సివిల్ నిర్మాణాన పనులు, మరమ్మతు పనులను నెలరోజుల్లో పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. 15 రోజుల్లో మళ్లీ సమీక్ష నిర్వహిస్తామని, అప్పటివరకు అన్ని పనులు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా గణనీయంగా ముందుకు సాగాలని ఆదేశించారు. పనులు పూర్తయిన వెంటనే మేజర్మెంట్ బుక్ (ఎంబీ) నమోదు ప్రక్రియను నిబంధనల మేరకు సకాలంలో పూర్తి చేయాలని, ఎలాంటి జాప్యానికి తావు ఇవ్వవద్దని సూచించారు. సమావేశంలోఅదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.


