రైతులు వినియోగించుకోవాలి..
● అన్ని మండలాల్లో రైతులకు ప్రత్యామ్నాయ పంటల విత్తనాల పంపిణీ
మహబూబ్నగర్ (వ్యవసాయం): ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం కల్పించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాలోని 17 మండలాల్లో సోమ, మంగళ, బుధవారాల్లో మూడు రోజులపాటు ‘విత్తన మేళా–2026’ నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్ తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్, కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎల్నినో ప్రభావంతో సాధారణ వర్షాలు ఆలస్యమయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు సూచించిన ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి మండలంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన విత్తనాలను పంపిణీ చేయనున్నారు.
అందుబాటులో ఉన్న విత్తనాలు
విత్తన మేళాలో కంది, మినుము, పెసర, సజ్జ, మొక్కజొన్న, ఆముదం, పొద్దుతిరుగుడు విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయి. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటే దిగుబడులు మెరుగ్గా వచ్చే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్నినో ప్రభావంతో వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉంది. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా శాస్త్రవేత్తలు సూచించిన ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి. అందుకే జిల్లాలో అన్ని మండలాల్లో విత్తన మేళా నిర్వహిస్తున్నాం. కంది, పెసర, మినుము, సజ్జ, మొక్కజొన్న, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి పంటల నాణ్యమైన విత్తనాలను రైతులకు అందిస్తాం. రైతులు తమ భూమి పరిస్థితులు, తేమను దృష్టిలో ఉంచుకుని తగిన పంటలను సాగు చేస్తే నష్టాన్ని తగ్గించుకోవడంతోపాటు మెరుగైన దిగుబడులు సాధించవచ్చు.
– గోవింద్నాయక్,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి


