మహబూబ్నగర్ న్యూటౌన్: సీ్త్రలపై వివక్ష, సామాజిక అణచివేత మహిళల అస్తిత్వానికి గొడ్డలి పెట్టులాంటివని, మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ఏఐటీయూసీ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం విజయలక్ష్మి అన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) జిల్లా 12వ మహాసభలు ఆదివారం జిల్లాకేంద్రంలోని రెడ్క్రాస్ భవన్లో జిల్లా అధ్యక్షురాలు భార్గవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సురవరం వెంకట్రామరెడ్డి భవన్ ఎదుట ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జెండాను రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన ఆవిష్కరించిన అనంతరం తెలంగాణ చౌరస్తా వరకు భారీ మహిళా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సురవరం విజయలక్ష్మి మాట్లాడుతూ తరతరాలుగా మహిళలు తీవ్రమైన హింస, అణచివేత, లింగ వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ఎన్నో పోరాటాలు, ఎందరో సామాజికవేత్తల కృషి ఫలితంగా మహిళలకు పాలకులు కొన్ని చట్టాలు తీసుకొచ్చిన వాటిని పకడ్బందీగా అమలు చేయకుండా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ మహిళలపై కొత్త రకమైన హింస, దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాల పరంపర కొనసాగుతుందని వాపోయారు. ఇప్పటికై నా మహిళలకు విద్య, వైద్యం, ఉపాధి, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు గాయని శ్యామల, బాలకిషన్, పద్మావతి, ఇందిర, కృష్ణవేణి, గీత, శ్రీదేవి, శ్రీవిద్య, సురేష్, రాము, లక్ష్మణ్, సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్, కార్తీక్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


