అమరచింత: విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడిన కుర్వ రాము అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి శనివారం జూడీషియల్ రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ స్వాతి తెలిపారు. మండలంలోని నాగల్ కడ్మూర్ గ్రామంలో గురువారం రాత్రి గస్తీ తిరుగుతున్న కానిస్టేబుళ్లు చెన్నయ్య, రవివర్మలపై ఇదే గ్రామానికి చెందిన కుర్వరాము తాగిన మైకంలో గొడవకు పాల్పడ్డాడన్నారు. గొడవను నివారించేయత్నం చేసినందుకు పోలీసు చేతిలో ఉన్న లాఠీని లాక్కుని ఎదురుదాడి చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.
కృష్ణానదిలో జారిపడి డిగ్రీ విద్యార్థి మృతి
అమరచింత: సరదాగా గడుపుదామని స్నేహితులతో కలిసి వెళ్లిన జాఫర్ (20) అనే విద్యార్థి నదిలో గల్లంతై మృతి చెందిన ఘటన ఆత్మకూర్ మండలంలోని జూరాల గ్రామ సమీపంలోని కృష్ణనదిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం కుడిచింతలబైలుకు చెందిన ఖాసీం కుమారుడు మహ్మద్ జాఫర్ ఆత్మకూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్పీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శనివారం ఉదయం కాలేజీకి వెళ్లి అక్కడి నుంచి స్నేహితులు అ భిషేక్, శివశంకర్తో కలసి జూరాల గ్రామ శివారులో కృష్ణనదిపై నిర్మిస్తున్న వంతెన వద్దకు వెళ్లారు. అభిషేక్, శివశంకర్ స్నానం చేద్దామని నదిలో దిగి ఈత కొడుతుండగా రాతిపై కూర్చున్న జాఫర్ అదుపుతప్పి నదిలో పడిపోయాడు. స్నేహితులు జాఫర్ను కాపాడేయత్నం చేస్తుండగానే నది ప్రవాహంలో కొట్టుకుపోయాడు. జాలర్లు గాలింపు చర్యలు చేపట్టగా ఆచూకీ లభించకలేదు. గద్వాల పోలీసుల సహకారంతో టీజీఎఫ్డీ బృందంతో గాలింపు ముమ్మరం చేశారు. చివరకు జాఫర్ మృతదేహం లభించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కుక్క పిల్లను కాపాడేయత్నంలో..
తమతో పాటు సరదా కోసం పెంపుడు కుక్కపిల్లను తీసుకెళ్లిన వారికి అదే కుక్క పిల్ల తమ స్నేహితుడి మృతికి కారణం అవుతుందనే విషయాన్ని గుర్తించలేక పోయారు. జాఫర్ వద్ద కుక్క పిల్లను వదిలి స్నానం చేద్దామని నదిలోకి దిగారు. నదిలో ఈత కొడుకున్న వారిని చూసిన కుక్కపిల్ల సైతం నదిలోకి దూకగా మెడకు ఉన్న తాడు సాయంతో దానిని గట్టుపైకి లాగే క్రమంలో జాఫర్ జారిపడి నదిలో పడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి మేనమాన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.


