కల్వకుర్తి రూరల్: ప్రపంచానికి సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక దారి చూపిన ఘనత యజ్ఞాలు, యాగాలదని రాష్ట్ర సాంస్కృతిక, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ మైదానంలో నిర్వహిస్తున్న 91వ విశ్వశాంతి మహాయాగంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాగశాల ప్రదక్షణ చేసి మహాశివుడికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి అభిషేకం, హారతి ఇచ్చారు. అనంతరం శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానందస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సర్వేజన సుఖినోభవంతు అంటూ దీవిస్తారని, అందరూ బాగుండాలని కోరుకోవడం మన సాంప్రదాయంలో భాగమన్నారు. నేటి శాస్త్ర సాంకేతికతో పాటు పూర్వీకులు మనకు ఇచ్చిన ధర్మం, శాంతి, సేవాభావాల గొప్పవరం యజ్ఞ, యాగాలన్నారు. నేటి సమాజంలో జరుగుతున్న దుర్ఘటనలు, సామాజిక రుగ్మతలు తొలగాలన్నా, సమాజం ధర్మ మార్గంలో నడవాలన్నా మనిషి ఆలోచన విధానాన్ని మార్చుకున్నప్పుడే సాధ్యమన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. సమాజ హితం, మానవాళి శ్రేయస్సు, వర్షాలు సమృద్ధిగా కురవాలని చేస్తున్న యాగం అందరికీ మేలు చేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. పిల్లలకు సంప్రదాయాలను అలవాటు చేయాలని పేర్కొన్నారు. సుదర్శన సహిత లక్ష్మీనారాయణ హోమం, రమాసహిత సత్యనారాయణస్వామి వ్రతాలను ఆచరించారు. వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం కనులపండువగా సాగింది.
యాగంలో ఎమ్మెల్యే దంపతులు..
విశ్వశాంతి మహాయాగంలో ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాధవి దంపతులతో పాటు రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీసింగ్, దీప దంపతులు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి గీత దంపతులు హోమంలో పాల్గొన్నారు.


