డోర్నకల్: జిల్లా వ్యాప్తంగా నర్సరీల్లో మిరప మొక్కలు పెంచుతున్న నిర్వాహకులు వర్షాభావ పరిస్థితులతో ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజుల్లో మిరప మొక్కలు నాటే పనులు ప్రారంభం కానుండడం, నర్సరీల నుంచి ఇప్పటి వరకు ఒక్క మొక్క కూడా విక్రయించకపోవడంతో నిర్వాహకులు హైరానా పడుతున్నారు.
నర్సరీ మొక్కలపై నమ్మకం..
రైతులు వ్యవసాయ భూముల్లో మిరప విత్తనాలు నాటితే పలు రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉండడంతో నర్సరీ మొక్కలపై ఆధారపడుతున్నారు. షెడ్ల నీడలో ప్లాస్టిక్ ట్రేలలో ట్రైకో డెర్మావిరిడి, సోడోమొనాలసిస్, నారావిల్, కొబ్బరిపీచుతో కలిపిన కోకోపిట్ మిశ్రమంతో ఆరోగ్యకరమైన మొక్కలను పెంచుతున్నారు. ఐదు నుంచి ఆరు ప్యాకెట్ల విత్తనాలతో 45 రోజుల్లో ఎకరాకు సరిపడా మొక్కలను సిద్ధం చేస్తున్నారు. నర్సరీల మొక్కలను రైతులు ఆదరిస్తుండడంతో జిల్లాలో నర్సరీల సంఖ్య విపరీతంగా పెరిగింది. గతంలో డోర్నకల్, కురవి, బయ్యారం లాంటి మండలాలకే పరిమితమైన నర్సరీలు ప్రస్తుతం ప్రతీ మండలానికి విస్తరించాయి. రైతులు దుక్కులు సిద్ధం చేసుకుని నర్సరీల్లోని మొక్కలను తీసుకెళ్లి నాటుకునేందుకు సిద్ధమవుతున్నారు.
వర్షాభావ పరిస్థితులతో ఆందోళన...
ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులతో పాటు నర్సరీల నిర్వాహకులు ఆందోళనకు గురవుతున్నారు. మగ కార్తె ప్రారంభమవుతుండడంతో రైతులు దుక్కులు పొతం చేసుకుని మిరప మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు మొక్కలను విక్రయించేందుకు నర్సరీల నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. అయితే నర్సరీలో మొక్కలు పెరిగి ఉండడం, వర్షాలు పడకపోవడంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. చెరువులు, వాగుల్లో నీరు చేరకపోవడం, బావుల్లో జలాలు అడుగంటడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. మరోవైపు వ్యవసాయ భూముల్లో రైతులు పెంచుతున్న మొక్కలు ఎండ తీవ్రతకు చనిపోతున్నాయి. ఎండల తీవ్రతతో ఇప్పటి నర్సరీల్లో ఒక్క మొక్క కూడా విక్రయించలేదని నిర్వాహకులు చెబుతున్నారు.
110 నర్సరీల్లో 1.5 కోట్లకు పైగా
మిరప మొక్కల పెంపకం
రైతుల వ్యవసాయ భూముల్లో మరో 1.5 కోట్ల మొక్కలు
35 వేల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం
వర్షాభావ పరిస్థితుల్లోరైతుల సందిగ్ధం
భారమవుతున్న నిర్వహణ..
పెరుగుతున్న ధరలు, వర్షాభావ పరిస్థితులు, పోటీతో నర్సరీల నిర్వహణ భారంగా మారుతుందని నిర్వాహకులు వాపోతున్నారు. 45 రోజలు తర్వాత విక్రయం కాని మొక్కల సంరక్షణ భారంగా మారుతోంది. చాలా సందర్భాల్లో మొక్కల ఆకులు పండుబారడం, వేరు వ్యవస్థ దెబ్బతిని చనిపోతుండటంతో నష్టాల పాలవుతున్నారు. కోకోపిట్ ధర గతంలో టన్ను రూ.5,550 ఉండగా ప్రస్తుతం వంద శాతం పెరిగి రూ.10,400 నుంచి రూ.11,000 వరకు చేరింది. కూలీల కొరత, పట్టాలు, ట్రేల ధరలు కూడా రెండింతలు పెరిగాయి. దీంతో నర్సరీల నిర్వహణ భారంగా మారుతోందని నిర్వాహకులు చెబుతున్నారు.


