బయ్యారం: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బయ్యారం పెద్ద చెరువు ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకంగా మారింది. 16.2 అడుగుల నీటి సామర్థ్యం గల చెరువులోకి బుధవారం నాటికి 13.3 అడుగుల మేర నీరు చేరింది. ఆయకట్టు పరిధిలో అధికారికంగా ప్రతీ వానాకాలంలో 7వేల ఎకరాల్లో వరిసాగు అవుతుండగా.. అనధికారికంగా మరో 7 వేల ఎకరాల్లో వరి సాగు అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. ఆయకట్టు ఎక్కువగా ఉండి చెరువు నీటి సామర్థ్యం తక్కువగా ఉండడంతో రెండు సార్లు చెరువు నిండితేనే పంటలు పండే పరిస్థితి.
ఎల్నినోతో రైతుల ఇబ్బందులు..
ప్రతీ వానాకాలంలో రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల కన్న బయ్యారం పెద్దచెరువు మొదట నిండుతుంది. ఈ ఏడాది ఎల్నినో కారణంగా చెరువులోకి వరదనీరు చేరడం కష్టతరంగా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకునేందుకు మరో 3 అడుగుల దూరమే ఉన్నప్పటికీ ఇటీవల ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా చెరువులోకి నీరు ఎప్పుడు చేరుతుందో తెలియని పరిస్థితి ఉంది.
వెదజల్లి.. వరి నాట్లు వేసిన రైతుల్లో ఆందోళన
బయ్యారం పెద్దచెరువు ఆయకట్టు పరిధిలో కొన్ని సంవత్సరాలుగా బయ్యారం, రంగాపురం, చర్లపల్లి, జాఫ్రబాద్, వెంకట్రాంపురం, సంగ్యాతండా, కోటగడ్డ, కొత్తపేట, గంధంపల్లి, సంతులాల్పోడుతండా తదితర గ్రామాలకు చెందిన రైతులు తొలకరిలో కురిసిన వర్షాలకు వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేస్తున్నారు. ఈ ఏడాది సైతం నెలరోజుల క్రితం రైతులు వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేశారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు బాడువ భూముల్లో నిలిచిన వర్షపునీటిని ఆధారం చేసుకొని రైతులు వరినాట్లు వేశారు. ఈ క్రమంలో గత వారంరోజులుగా వరుణదేవుడి కరుణ లేకపోవడంతో పంటలు వాడుముఖం వేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో చేరిన నీటిని విడుదల చేస్తే తమ పంటలకు జీవం వస్తుందని రైతులు పేర్కొంటున్నారు.
బయ్యారం పెద్దచెరువులో 13.3అడుగుల నీటిమట్టం
ఇప్పటికే వందలాది ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరి సాగు
ఇటీవల కురిసిన వర్షాలతో పెరిగిన మరింత సాగు విస్తీర్ణం
నీటి విడుదలపై ఆదేశాలు లేవంటున్న ఇరిగేషన్ అధికారులు


