● డీఈఓ సత్యనారాయణమూర్తి
కురవి: పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. బుధవారం కాంపల్లి పీఎంశ్రీ హైస్కూల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల ప్రగతి, తరగతి గదుల్లో బోధన–అభ్యసన ప్రక్రియ, మధ్యాహ్న భోజన పథకం అమలు, పాఠశాల పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రీ ప్రైమరీ తరగతులను పరిశీలించి, విద్యార్థుల అభ్యసనానికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా కార్యాచరణతో ముందుకు సాగాలని, గుణాత్మకమైన విద్యను అందించాలని, ప్రతీ తరగతి గదిలో బోధిస్తున్న అంశానికి అనుగుణంగా టీఎల్ఎంలను ప్రదర్శించి ఐఎఫ్బీ ప్యానళ్లను వినియోగించాలని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీరోలు ఎంఈఓ ఇస్లావత్ లచ్చిరాంనాయక్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, హెచ్ఎం కరుణశ్రీ పాల్గొన్నారు.
క్రీడల్లో రాణించేలా కృషి చేయాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించేలా పీఈటీలు, పీడీలు కృషి చేయాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్జీఎఫ్ జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వివిధ స్థాయిల్లో క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు వారి ప్రతిభ ద్వారా లభించిన ప్రశంసపత్రాలు వారి భవిష్యత్కు ఉపయోగపడాలన్నారు. జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రస్థాయి క్రీడలు క్రమశిక్షణతో నిర్వహించాలని, జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఎంఈఓలు లచ్చిరాంనాయక్, వెంకటేశ్వర్లు, డీవైఎస్ఓ జ్యోతి, డీఎస్ఓ అప్పారావు, పీఈటీలు పాల్గొన్నారు.


