● మృతుడు పశ్చిమబెంగాల్ వాసి
● ఎల్సీ తీసుకోకముందే
స్తంభం ఎక్కించడంతో ప్రమాదం
జూపాడుబంగ్లా: విద్యుత్ అధికారులు, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కాంట్రాక్టర్, సూపర్వైజర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. మండ్లెం గ్రామంలో ఆర్డీఎస్ఎస్ (రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం) పనులు చేస్తూ విద్యుదాఘాతంతో పశ్చిమబెంగాల్కు చెందిన రాజాషేక్ (28) మంగళవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు, అఽధికారులు తెలిపిన వివరాల మేరకు.. ఆర్డీఎస్ఎస్ పనులు చేసేందుకు సూపర్వైజర్లు శివ, అఖిల్ అధ్వర్యంలో కార్మికులు ఉదయం 10 గంటల మండ్లెం గ్రామంలోని పుల్లారెడ్డి బంకు వద్దకు చేరుకున్నారు. లైన్మెన్ రాజశేఖర్ ఆర్డీఎస్ఎస్తో పాటు మండ్లెం ఫీడర్ రెండింటికీ ఎల్సీ తీసుకోవాల్సి ఉండగా కేవలం మండ్లెం ఫీడర్కు మాత్రమే 10.20 గంటలకు ఎల్సీ తీసుకున్నట్లు విద్యుత్ సబ్స్టేషన్ రికార్డుల్లో నమోదు చేశారు. ఘటన ప్రాంతం వద్ద సీసీ కెమెరా దృశ్యాల్లో ఉదయం 10.16 గంటలకు విద్యుదాఘాతంతో స్తంభంపై నుంచి రాజాషేక్ కిందపడి ప్రాణాలు కోల్పోయినట్లు నమోదైంది. దీంతో లైన్మెన్ ఎల్సీ తీసుకోకముందే కార్మికుడిని విద్యుత్ స్తంభం ఎక్కించినట్లు తెలుస్తోంది. విద్యుత్షాక్తో స్తంభం పైనుంచి కిందపడిన రాజాషేక్ను అక్కడున్న కార్మికులు హుటాహుటిన నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకొని అధికారులు, కాంట్రాక్టర్లు అక్కడి నుంచి ఎస్కేప్ కావడం గమనార్హం. ఎస్ఐ మల్లికార్జున నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడు రాజాషేక్ పశ్చిమబెంగాల్ రాష్ట్రం, లక్ష్మిపూర్బెల్దాగ్ గ్రామం, వీటీసీ బాగ్బరి, పీఓ మలీహా, మల్దా జిల్లా వాసిగా ఆధార్కార్డు ప్రకారం వివరాలు బహిర్గమయ్యాయి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నట్లు తోటి కార్మికులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మృతుడి కుటుంబ సభ్యులెవరూ లేకుండానే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రయత్నాలు జరిగాయి. బాధిత కుంటుంబానికి ఎంతో కొంత ముట్టజెప్పి సమస్యలేకుండా మృతదేహాన్ని పశ్చిమబెంగాల్కు తరలించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.


