● మెగా డీఎస్సీ ర్యాలీలో పాల్గొన్న
వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై
కక్ష సాధింపు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. కొందరికి 41ఏ నోటీసులు జారీచేశారు. సోమవారం మెగా డీఎస్సీ అక్రమాలను ఎత్తిచూపుతూ వైఎస్సార్సీపీ ర్యాలీ నిర్వహించగా ఇందులో పాల్గొన్న నేతలు, కార్యకర్తలపై పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించారు. నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించినా పోలీసులు కేసులు నమోదు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
● కర్నూలు ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు నగర మాజీ మేయర్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై.రామయ్య, పార్టీ నగర అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్తో పాటు 53 మంది నేతలు, కార్యకర్తలపై అదే రోజు సాయంత్రానికి పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరితోపాటు మరికొందరిపైనా కేసులు నమోదు చేస్తామని పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
● ఎమ్మిగనూరు నియోజకవర్గ కేంద్రంలో ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ ప్రచారకార్యదర్శి చాంద్ బాషాపైన పోలీసులు కేసు పెట్టారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళుతున్న తనను వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకోవడంతో ఆసుపత్రికి వెళ్లలేకపోయానంటూ ఒక వ్యక్తితో ఫిర్యాదు తీసుకొని పోలీసులు ఈ కేసు నమోదు చేయడం గమనార్హం. దీనిని బట్టి పోలీసులు ఉద్దేశ పూర్వకంగానే అక్రమ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొందరు పార్టీ కార్యకర్తలపైనా కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం.
● ఆదోని నియోజకవర్గంలో ర్యాలీలో పాల్గొన్న పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రకాంత్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు, మాజీ సర్పంచ్ శేషిరెడ్డితోపాటు మరో 50 మందిపై కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొందరికి ఇప్పటికే 41ఏ నోటీసులు జారీ చేశారు. వీరితోపాటు మరికొందరికి సైతం నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లోనూ పోలీసులు వైఎ్ససార్సీపీ శ్రేణులపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.


