కర్నూలు(సెంట్రల్): జీఎస్టీ వసూళ్ల సాధన కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో వాణిజ్య పన్నుల శఖ ఆధ్వర్యంలో జీఎస్టీ కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ మార్గాలను మెరుగుపరచడంతోపాటు పన్ను వసూళ్లలో పారదర్శకతను పెంచాలన్నారు. జీఎస్టీ బకాయిలు, రెవెన్యూ బకాయిల వసూళ్లలో అన్ని ప్రభుత్వ శాఖలు అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు. కొనుగోలు పోర్టల్లో వేలం ప్రక్రియకు సంబంధించినఅంశాలను సమవర్ధంతంగా నిర్వహిస్తూ బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలన్నారు. పన్ను డిఫాల్టర్ల పాన్ నంబర్ల ఆధారంగా బ్యాంక్ ఖాతాలను గుర్తించి ఫ్రీజ్ చేయాలన్నారు. ఫ్రీజ్ చేసిన అనంతరం లీడ్బ్యాంకు మేనజర్తో అధికారులు సమన్వయం చేసుకోవాలని కమర్షియల్ టాక్స్ జేసీ నీరజను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ జెడ్ఎం మధసూదన్రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ కామేశ్వర ప్రసాదు, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి బజారి, జెడ్పీ సీఈఓ సుధాకరరెడ్డి, మైనింగ్ డీడీ నాగిని పాల్గొన్నారు.
డ్రంకెన్ డ్రైవ్లో నలుగురికి జరిమానా
డోన్ రూరల్: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన నలుగురిలో ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. ఈ మేరకు డోన్ స్పెషల్ జ్యూడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూరుల్లా తీర్పు ఇచ్చినట్లు రూరల్ సీఐ రాకేష్, ఎస్సై మమత తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల డ్రైవర్లతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదమన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గుర్తు తెలియని
వ్యక్తి దుర్మరణం
వెల్దుర్తి: పట్టణ పరిధిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న హైవే 44పై మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని మృతదేహం కనిపించింది. హైవే పోలీసుల సమాచారం అందుకుని సంఘటనాస్థలికి చేరుకున్న ఎస్ఐ నరేశ్, పోలీసులు విచారించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లు గుర్తించారు. మృతుడు కొద్దికాలంగా పట్టణంలో, హైవేపై మానసిక స్థితి సరిగా లేక భిక్షాటన చేస్తూ తిరిగేవాడిగా తెలుసుకున్నారు. మృతదేహాన్ని స్థానిక సీహెచ్సీ మార్చురీకి తరలించారు. మృతునికి 45 ఏళ్లు పైబడి ఉండొచ్చని, షర్టు, ప్యాంటు వేసుకున్నాడని, గుర్తించిన వారు పోలీస్స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు.
వృద్ధురాలి ఆత్మహత్య
బనగానపల్లె రూరల్: బనగానపల్లె పట్టణంలోని బేతంచెర్ల రోడ్డులోని కోళ్లఫారం వద్ద నివాసం ఉంటున్న ఎన్. లక్ష్మీదేవి (80) అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మీదేవి కొన్ని సంవత్సరాల నుంచి కీళ్ల నొప్పుల వ్యాధి, మూర్చ వ్యాధి సమస్యలతో ఇబ్బందులుపడుతోంది. కుటుంబసభ్యులు పలు వైద్యశాలలో చూపించినా నయం కాలేదు. దీంతో మనస్తాపం చెంది జీవితంపై విరక్తి చెంది రసాయన పౌడర్ను నీటిలో కలుపుకుని తాగి ఆత్యహత్యకు పాల్పడింది. మృతురాలి కుమారుడు దస్తగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కల్పన తెలిపారు.
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
కర్నూలు: రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏపీఎస్పీ రెండో బెటాలియన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ వరప్రసాదరెడ్డి కుటుంబానికి సహో ద్యోగులు ఆర్థిక సాయం అందించారు. 2007 బ్యాచ్ గ్రేహౌండ్స్ సిబ్బంది అండగా నిలిచారు. జూలై 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో వరప్రసాద రెడ్డి మృతిచెందారు. సహచరుడు మరణించడంతో విషాదంలో ఉన్న ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో 2007 బ్యాచ్ గ్రేహౌండ్స్ యూనిట్ సిబ్బంది అందరూ కలసి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించారు. మొత్తం రూ.1.75 లక్షల ఆర్థిక సాయాన్ని బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. కష్టకాలంలో తన కుటుంబానికి అండగా నిలిచిన తోటి సిబ్బందికి మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


