● ఇంతియాజ్ను చంపింది టీడీపీ వాళ్లే
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు లేని హత్యలు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కర్నూలు పాతబస్తీలో ఈనెల 7వ తేదీ జరిగిన హత్య ఘటనలో నిందితులు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అని తెలిపారు. టీజీ భరత్, టీజీ వెంకటేష్తో కలిసి వారు దిగిన ఫొటోలను ఆయన ప్రదర్శించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కర్నూలులో జరిగిన హత్యలకు వైఎస్సార్సీపీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. మంత్రి టీజీ భరత్ మాత్రం హత్యలను వైఎస్సార్సీపీకి ఆపాదించడం తగదన్నారు. ఈ హత్యను సాకుగా చూపి పాతబస్తీలోని తమ పార్టీకి చెందిన వస్తాద్, ఇమ్రాన్లపై అక్రమంగా కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం పోలీసులను వాళ్ల పని వాళ్లను చేసుకోనిచ్చిందన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం సోషల్ మీడియాలో ఉండే వైఎస్సార్సీపీపై వాళ్లపై కేసులు పెట్టడమే పనిగా పోలీసులను వాడుకుంటోందన్నారు. పదో వార్డు కార్పొరేటర్ షేక్ యూనుస్ బాషా కార్యాలయంపై దాడి చేసి బీభత్సం చేసిన వారిని కాదని, బాధితుడిపై హత్య కేసు నమోదు చేయడం దుర్మార్గం అన్నారు. ఇంతియాజ్ హత్య బాధాకరమని, తమ పార్టీ ఇటువంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహించబోదన్నారు.
మహిళలను తక్కువ చేసి మాట్లాడటం తగదు
మంత్రి టీజీ భరత్ ఒక సమావేశంలో ‘మేం గాజులు తొడుక్కోలేదని, మా నాన్న దగ్గర నాలుక కోసే వాళ్లు ఉంటే నా దగ్గర అంతకు మించి ఉన్నారని’ వ్యాఖ్యానించారని ఎస్వీ గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలతో డబ్బులు తీసుకోని హత్యలు చేసే వాళ్లంతా ఎవరి వద్ద ఉన్నారో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. మహిళలను తక్కువ చేసి మాట్లాడటం తగదన్నా రు. శాంతియుతంగా మహిళల ఆధ్వర్యంలో ర్యాలీ చేస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. మౌర్య ఇన్ ఎదుట ఉన్న ఆర్అండ్రోడ్డు మీరేమైన కొన్నారా అని ప్రశ్నించారు. ఎన్నో సార్లు ఇదే దారిలో ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలు చేశామని గుర్తు చేశారు.


