కోనేరుసెంటర్: మచిలీపట్నంలో ఇటీవల జరిగిన ఓ దొంగతనం కేసులో నిందితులను చిలకలపూడి పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. పరిచయస్తులే ఈ దొంగతనం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి బందరు ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీనివాసరావు బుధవారం చిలకలపూడి పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
మచిలీపట్నంలోని నరసింహనగర్కు చెందిన పి. జయరాజ్ మొవ్వ మండలం కూచిపూడి జెడ్పీ హైస్కూలులో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య నగరంలోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూలులో టీచర్గా పనిచేస్తుంది. వీరిరువురు గత నెల 27వ తేదీన రోజులానే ఇంటికి తాళం పెట్టి విధులకు వెళ్లిపోయారు. ఆ సమయంలో జయరాజ్ భార్య తండ్రి వద్ద గతంలో నమ్మకంగా పనిచేసిన గుడ్లవల్లేరు మండలం వెళుతురుమిల్లి గ్రామానికి చెందిన చొక్కా వీరబాబు, అతని భార్య శ్రీలత, వీరబాబు సోదరుడు వెంకటేశ్వరరావు ఆటోలో నరసింహనగర్కు చేరుకున్నారు. చుట్టుపక్కల పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చేరుకున్నారు. కబోర్డులో ఉన్న సుమారు 105 గ్రాముల బంగారు వస్తువులను దొంగిలించి పారిపోయారు. సాయంత్రం ఇంటికి చేరుకున్న జయరాజ్ అతని భార్య దొంగతనం జరిగినట్లు గుర్తించి.. చిలకలపూడి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్నారు.
పట్టించిన సీసీ కెమెరా..
బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ ఎస్కే నభీ ఆధ్వర్యంలో బందరు సీసీఎస్ బృందం దర్యాప్తు చేపట్టారు. జయరాజ్ ఇంటి సందులో ఉన్న పలు సీసీ కెమెరాలను పరిశీలించగా ఆ రోజు జయరాజ్ ఇంటి ఎదుట ఆటో ఆగి ఉన్నట్లు పసిగట్టారు. ఆటో ఆధారంగా దర్యాప్తు మరింత ముమ్మరం చేసిన పోలీసులు.. ఈ నెల 4వ తేదీన చిలకలపూడి రైల్వేస్టేషన్ సమీపంలో బైక్పై వెళుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు 95 గ్రాముల వరకు బంగారు వస్తువులను రికవరీ చేసినట్లు ఇన్చార్జ్ డీఎస్పీ తెలిపారు. పెడన ముత్తూట్ బ్యాంకు వెంకటేశ్వరరావు కొంత బంగారాన్ని తాకట్టు పెట్టగా వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురిని అరెస్ట్ చేసి బుధవారం కోర్టుకు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఆయన చెప్పారు.
ఇంట్లో బంగారం చోరీ కేసులో
నిందితులు అరెస్ట్


