ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.48కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు గురువారం మహామండపం ఆరో అంతస్తులో జరిగింది. 15రోజులకు గాను అమ్మవారి ఆలయంలోని హుండీల ద్వారా రూ.3,48,25,362 నగదుతో పాటు 318 గ్రాముల బంగారం, 3.800కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. ఇక విదేశాలకు చెందిన కరెన్సీ భారీగానే లభ్య మైందని అధికారులు పేర్కొన్నారు. యుఎస్ఏకు చెందిన 590 డాలర్లు, యుఏఈకి చెందిన 320 దిర్హమ్స్, ఖతార్ 263 రియాల్స్, ఒమెన్కు చెందిన 100 బైంసాలు, హాంగ్కాంగ్ డాలర్లు 60, మలేషియాకు చెందిన 53 రింగట్స్ లభించినట్లు అధికారులు తెలిపారు. కానుకల లెక్కింపులో ఆలయ సిబ్బందితో పాటు సేవా సిబ్బంది పాల్గొనగా, వన్టౌన్, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
కృత్తివెన్ను: లెప్రసీ వ్యాధిపై సరైన అవగాహనతో పాటు అప్రమత్తత ఉంటే ఆ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించగలమని లెప్రసీ రాష్ట్ర అధికారి ఉషారాణి అన్నారు. గురువారం ఆమె తన బృందంతో మండలంలోని కృత్తివెన్ను, పీతలావ, వాలంక, గుడిదిబ్బ, సీతనపల్లి దళితవాడ, తాడివెన్ను, చందాల, గరిశపూడి, మాట్లాం గ్రామాల్లో పర్యటించి పలువురికి లెప్రసీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు వ్యాధి కారకాలైన మచ్చలు, లక్షణాలను వివరించారు. వీరు జరిపిన పరీక్షల్లో ఎవరికీ వ్యాధి లక్షణాలు లేవని కృత్తివెన్ను పీహెచ్సీ వైద్యులు సాయి సందీప్ తెలిపారు. పర్యటనలో వైద్యుడు జయ కృష్ణ, లెప్రసీ డీపీఎంవో సుబ్బారెడ్డి, ఏపీఎంవో శ్రీనివాస్, జిల్లా న్యూక్లియస్ మెడికల్ అధికారి వేణు తదితరులు పాల్గొన్నారు.
గన్నవరం: స్థానిక సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గురువారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సందర్శించారు. కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రికార్డులను, నాన్ జ్యూడీషియల్, రెవెన్యూ తదితర స్టాంప్ల నిల్వలను ఐజీ పరిశీలించారు. గత నాలుగు నెలలుగా జరిగిన రిజిస్ట్రేషన్లు, ఆదాయ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆదాయం సాధించాలని చెప్పారు. గన్నవరం సబ్రిజిస్ట్రార్ కార్యాలయం గత నాలుగు నెలలకుగాను రూ. 13కోట్లు ఆదాయ లక్ష్యానికిగాను 75 శాతం రెవెన్యూ మాత్రమే వచ్చినట్లు తెలిపారు. ఇన్చార్జ్ డీఐజీ కె. రామారావు, జిల్లా రిజిస్ట్రార్ ఎంఎస్జీకే మూర్తి, సబ్రిజిస్ట్రార్ వీవీవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


