ఖమ్మంమయూరిసెంటర్: కమ్యూనిస్టు ఉద్యమానికి చెందిన వారంతా విభేదాలను పక్కనపెట్టి ఒకతాటిపైకి వచ్చేందుకు ఆలోచించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. ప్రజల సమస్యల దృష్ట్యా రానున్న కాలమంతా కమ్యూనిస్టులుదేనని తెలిపారు. విప్లవోద్యమంలో సుదీర్ఘకాలం పనిచేసిన రాయల చంద్రశేఖర్ జీవితం, ఎదుర్కొన్న పరిస్థితులపై ఆయన సతీమణి విమల రచించిన ‘ఒక విప్లవ ప్రేమికుడు – కామ్రేడ్ రాయల చంద్రశేఖర్’పేరిట పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్ని ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నాయకుల సమక్షాన కూనంనేని ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన ఎందరో పెద్ద పదవుల్లో ఉన్నారని తెలిపారు. అనంతరం ఐఎఫ్టీయూ జాతీయ ఉపాధ్యక్షుడు పి.ప్రసాద్ మాట్లాడుతూ.. చంద్రశేఖర్ ఏడు ప్రాంతాల్లో తిరుగుతూ విప్లవోద్యమంలో పనిచేయగా, ఆయన ఉద్యమ జీవితంలోని వివిధ దశలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ఆతర్వాత సతీష్ చందర్ మాట్లాడుతూ.. దాదాపు 50ఏళ్లు విప్లవోద్యమ జీవితాన్ని కొనసాగించిన రాయల ప్రస్థానాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ఇంకా పలువురు మాట్లాడుతూ విమల రచించిన పుస్తకం విప్లవ పార్టీలన్నింటినీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని తెలియచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాయల విమల, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఏకేఎంఎస్ జాతీయ నాయకుడు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడగా, మధు, ఎస్పాల్, సృజన, అజయ్, సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, ఐఎఫ్టీయూ జాతీయ నాయకుడు సాదినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


