దొడ్డబళ్లాపురం: రాష్ట్ర ప్రభుత్వం బిడది టౌన్షిప్ పేరుతో రైతుల పొట్ట కొడితే చూస్తూ ఊరుకోమని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. టౌన్షిప్ వ్యతిరేక పాదయాత్ర సోమవారంనాడు రెండోరోజుకు చేరుకొంది. దేవెగౌడ ప్రసంగిస్తూ టౌన్షిప్ కావాలని రైతులు అడగలేదన్నారు. టౌన్ షిప్ నిర్మిస్తానని ఢిల్లీలో సీఎం ఎవరెవరికి మాట ఇచ్చారో చెప్పాలన్నారు. టౌన్షిప్ పేరుతో 7,481 ఎకరాల వ్యవసాయ భూములను కొల్లగొట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రైతుల కడుపు కొట్టే ఏ ప్రాజెక్టు అయినా తాను అడ్డుకుంటానన్నారు.
పోలీసులతో గొడవ
పాదయాత్ర కణమిణికె కాలనీ వద్దకు చేరుకోగానే బెంగళూరు పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లు పెట్టారు. దీంతో జేడీఎస్ కార్యకర్తలు, రైతులు వాగ్వాదానికి దిగారు. నిఖిల్ కుమారస్వామి మాట్లాడుతూ పాదయాత్ర ను అడ్డుకుంటే సర్కారు తప్పును ఒప్పుకున్నట్టే అన్నారు. తాము శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నామన్నారు. తరువాత పాదయాత్ర ముందుకు సాగింది.
సర్కారుపై దేవెగౌడ ధ్వజం


