సాక్షి, బళ్లారి: వాల్మీకి అభివృద్ధి నిగమ మండలిలో కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని జైలుకు వెళ్లి వచ్చిన నాగేంద్రకు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి కట్టబెట్టింది. ఇదంతా చూస్తే ఆ పార్టీ అవినీతికి కొమ్ముకాస్తున్నట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నాగేంద్ర ఏమి సాధించారో తెలియడం లేదు.. అవినీతి కూపంలో కూరుకుపోయిన్పప్పటికి మంత్రి పదవి ఇచ్చారన్నారు. నాగేంద్రతో రాజీనామా చేయించే వరకు అసెంబ్లీ సమావేశాలు కూడా జరగనివ్వకూడదన్నారు. వాల్మీకి నిగమ మండళి అభివృద్ధి అధికారి చంద్రశేఖర్ మృతికి కారణం కావడం, నకిలీ ఖాతాలు సృష్టించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్న వ్యక్తికి మంత్రి పదవి మళ్లీ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర, ప్రతిపక్ష నాయకుడు ఆశోక్, చలవాది నారాయణ స్వామి కలిసి నాగేంద్రతో రాజీనామా చేయించే వరకు అసెంబ్లీలో పోరాటం చేయాలని సూచించారు. డీకే, బీకే ఒత్తిడితోనే బసవరాజు హొరట్టి రాజీనామా చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ లోక్సభ సభ్యుడు సన్నపక్కీరప్ప, పాలికె ప్రతిపక్ష నాయకుడు మోత్కూరు శ్రీనివాస రెడ్డి, కార్పొరేటర్లు అశోక్, హనుమంతప్ప, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాగేంద్రకు మంత్రి పదవి ఎలా ఇచ్చారు?
మాజీ మంత్రి శ్రీరాములు


