సాక్షి, బళ్లారి: వీరశైవ విద్యావర్దక సంఘం సేవలు ఆదర్శం అని పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం హీరద సూగమ్మ పాఠశాల శబాబ్ది వేడుకల ముగింపు సమావేశం నిర్వహించారు. కొట్టూరు గవిమఠం స్వామిజీ అభినవ సిద్దలింగేశ్వర స్వామి, మంత్రి ఈశ్వర్ ఖండ్రే, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, పలువురు స్వామీజీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వీరశైవ విద్యావర్ధక సంఘం ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వంద సంవత్సరాలు క్రితమే విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ ప్రాంతంలో ఎందరో బాగు పడ్డారని తెలిపారు. వీరశైవ విద్యావర్దక సంఘం విద్యాభివృద్ధికి పెద్దపీఠ వేసిందని గుర్తు చేశారు. శబాబ్దం క్రితమే మనిషి జ్ఞానంతో జీవించాలనే ఉద్దేశంతో ఈ విద్యా సంస్థలను ప్రారంభించారని వెల్లడించారు. ప్రస్తుతం విద్యాసంస్థలను డబ్బు సంపాదించేందుకు ప్రారంభిస్తున్నారన్నారు. విద్యా సంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు రిటైర్డ్ ఉపాద్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వీరశైవ విద్యావర్ధక సంఘం అధ్యక్షుడు కణేకల్ మహంతేష్, డాక్టర్ అరవింద్ పాటిల్, సీనియర్ పాత్రికేయులు వీరభద్రగౌడ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన హీరద సూగమ్మ పాఠశాల శతాబ్ది వేడుకలు


