సాక్షి,బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని పలు జిల్లాలకు తాగు, సాగునీరందించే ఉమ్మడి జలాశయం తుంగభద్ర డ్యాం పూర్తిగా నిండాలని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి హనుమాన్ చాలీసా పఠించారు. ఆయన శనివారం హొసపేటె సమీపంలోని తుంగభద్ర డ్యాం వద్ద కొండపై వెలసిన శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం 108 సార్లు హనుమాన్ చాలీసాను పఠించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే శ్రీఆంజనేయస్వామి హనుమాన్ చాలీసా చదివి ప్రార్థిస్తే కచ్చితంగా కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ఉందన్నారు. గతంలో కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు ఇక్కడ ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పఠించి డ్యాం నిండాలని ప్రార్థించామన్నారు. అదే సంవత్సరం డ్యాం నిండి రైతులకు మంచి పంటలు పండాయన్నారు. ప్రస్తుతం డ్యాం నిండకపోవడంతో ఖరీఫ్ పంట సాగు చేయడానికి రైతన్నలు ఎంతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంచి వర్షాలు పడి రైతులు పంటలు పండించుకునేందుకు వీలు కల్పించాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. కచ్చితంగా త్వరలో డ్యాం నిండుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.


