రాయచూరు రూరల్: జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించాలని జిల్లా ఇంచార్జి మంత్రి అజయ్ సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాధికారి కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఖరీఫ్లో ముందుగానే వానలు కురవడంతో రైతులు వేసుకున్న విత్తనాలు సరిగా మొలకెత్తక పంట నష్టం జరిగిన నేపథ్యంలో అధికారులు రైతులకు సహకరించాలన్నారు. పశువులకు గ్రాసం కొరత రాకుండా చూడాలని సూచించారు. మరో వారం రోజుల్లో వానలు కురవకపోతే రైతులకు పంటల బీమా పాలసీలు చేసుకోడానికి అవకాశం కల్పించాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే సబ్సిడీ పథకాలను రైతులకు అందించాలన్నారు. ఎంపీ కుమార నాయక్, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ దద్దల్, హంపయ్య నాయక్, బసన గౌడ తుర్విహాళ్, ఎమ్మెల్సీలు బోసురాజ్, బసన గౌడ బాదర్లి, జిల్లాధికారి పూవిత, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగర పాలికె కమిషనర్ జుబిన్ మహాపాత్రో, వ్యవసాయ శాఖాధికారి హుసేన్ పాల్గొన్నారు.


