పంటలను పరిశీలిస్తున్న మంత్రి శరణు ప్రకాష్ పాటిల్
పంటలను తిలకిస్తున్న మంత్రి శివరాజ్ తంగడిగి
పంటలను పరిశీలిస్తున్న మంత్రి విజయానంద కాశప్పనవర్
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదేశాల మేరకు ఉత్తర, మధ్య, కల్యాణ కర్ణాటకలో ఇంచార్జి మంత్రులు కరువు అధ్యయనం చేశారు. రైతుల సంక్షేమమే సర్కార్ ధ్యేయమని మంత్రులు పేర్కొన్నారు. యాదగిరి జిల్లా ఇంచార్జి శరణు ప్రకాష్ పాటిల్, కొప్పళ జిల్లా ఇంచార్జి మంత్రి శివరాజ్ తంగడిగి, బాగల్కోటె ఇంచార్జి మంత్రి విజయానంద కాశప్పనవర్ తమ తమ జిల్లాల్లో పర్యటించి రైతులు పంటలు వేసుకున్న భూముల్లో వాడుముఖం పట్టిన పంటలను పరిశీలించారు. యాదగిరి జిల్లాలో అధిక మొత్తంలో ఎరువులు, రసాయనిక, క్రిమి సంహారక మందులు విక్రయిస్తున్న అంశంపై రైతులు మంత్రి పాటిల్ దృష్టికి తెచ్చారు. బాగల్కోటె జిల్లా హునగుంద తాలూకా హేరూరులో పంటలను చూసి మంత్రి విజయానంద కాశప్పనవర్ చలించి పోయారు. కరువు పరిస్థితిని అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి సమగ్ర నివేదికను అందచేస్తామన్నారు. కొప్పళ జిల్లాలో మంత్రి శివరాజ్ తంగడిగి గంగావతి, కనకగిరి, కారటిగి ప్రాంతాల్లో సంచరించి కరువుతో దెబ్బ తిన్న పంటలను పరిశీలించారు.
పంట నష్టంపై మంత్రి పరిశీలన
చెళ్లకెరె రూరల్: తాలూకాలోని హళ్లికుంటె గ్రామాన్ని మంత్రి టీ.రఘుమూర్తి సందర్శించి తీవ్ర కరువు కారణంగా హాని జరిగిన వక్కతోటలను పరిశీలించి రైతు సమస్యలను తెలుసుకున్నారు. కరువు వల్ల కష్టాలు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తక్షణమే అధికారులతో చర్చించి సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని అన్నారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. భోవి నిగమ అధ్యక్షుడు ఎం.రామప్ప, అధికారులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లాల్లో కరువు అధ్యయన బాటలో అమాత్యులు
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో
ఇంచార్జి మంత్రుల పర్యటనలు


