రాయచూరు రూరల్: మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా, దాని ఉపనదులకు వరద పోటెత్తింది. ఈ క్రమంలో ఆల్మట్టి, నారాయణపుర నుంచి లక్షా 50 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. దీంతో ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బాగల్కోటె, విజయపుర, గదగ్, కళ్యాణ కర్ణాటకలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. జిల్లాలోని లింగసూగూరు, దేవదుర్గ, రాయచూరు తాలూకాలో లోతట్టు ప్రాంతాల్లో అధికారులు పర్యటించి ప్రజలను జాగృతం చేశారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు ప్రమాదపు హెచ్చరికలు జారీ చేశారు. బెళగావి జిల్లాలో శంకర లింగ దేవాలయం, రాయచూరు తాలూకా కాడ్లూరు వద్ద ఉపేంద్ర తీర్థ ఆలయం నీట మునిగింది. లింగసూగూరు తాలూకా శీలహళ్లి, హంచినాళ వాగుల్లో నీటి ఉధృతితో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేవదుర్గ తాలూకా హువిన హెడగి వంతెన పైగుండా నీరు పారుతోంది. భారీ వర్షాలతో కోయ్నా డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో ఉత్తర కర్ణాటకలో నదులు ఉప్పొంగుతున్నాయి. దూద్గంగా, వేదగంగా, ఘటప్రభ, మలప్రభ నదులు పరవళ్లు తొక్కుతున్నాయి.
కృష్ణా, దాని ఉపనదులకు
ముంచెత్తిన వరదలు
ఆల్మట్టి డ్యాం నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల


