రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన తరుణంలో ఆయా జిల్లాల శాసన సభ్యులను జిల్లా ఇంచార్జి మంత్రులుగా నియమించారు. రాయచూరు జిల్లా ఇంచార్జి మంత్రి నియామకంలో అన్యాయం జరిగింది. ప్రస్తుతం జిల్లా ఇంచార్జి మంత్రిగా మంత్రి అజయ్ సింగ్ను నియమించడంపై జిల్లా ప్రజలు ఆందోళన చెందుతు న్నారు. కల్యాణ కర్ణాటకలో కలబుర్గి జిల్లా నుంచి శరణు ప్రకాష్ పాటిల్, అజయ్ సింగ్, ప్రియాంక్ ఖర్గే, కొప్పళ జిల్లా నుంచి బసవరాజ రాయరెడ్డి, శివరాజ్ తంగడిగి, బీదర్ నుంచి ఈశ్వర్ ఖండ్రే, విజయపుర నుంచి ఎం.బీ.పాటిల్, బాగలకోటె నుంచి విజయానంద కాశప్పనవర్ మంత్రి పదవులను దక్కించుకున్నారు. రాయచూరు, విజయనగర(హొసపేటె), యాదగిరి జిల్లాలో సమర్థులైన నాయకులున్నా రాయచూరు జిల్లా ఇంచార్జి బాధ్యతలను ఇతర జిల్లాల వారి పరం కావడం నేటికీ తప్పలేదు. 2013లో కాంగ్రెస్ పార్టీ హయాంలో మాలాశ్రీ, ఆనంద్ అస్నోటికర్, తన్వీర్ సేట్, శరణు ప్రకాష్ పాటిల్, 2018లో బీజేపీ హయాంలో సోమణ్ణ, శ్రీరాములు, లక్ష్మణ్ సవది, శంకర్ పాటిల్ మునేనకొప్ప ఇంచార్జిలుగా కొనసాగారు.
స్థానికులకే సమస్యలపై అవగాహన
జిల్లా సమస్యలపై స్థానికంగా ఎన్నికై న శాసన సభ్యులకు అవగాహన ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర జిల్లాల వారు నియమితులైతే కేవలం సభలు, సమావేశాలకు, జాతీయ పండుగలకు చుట్టరికంలా వస్తారనే అభిప్రాయాలున్నాయి. 23 ఏళ్లుగా రాయచూరు అన్య జిల్లాల వారి పెద్దనానికి లోనై అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. రాయచూరులో ఇంచార్జి మంత్రులకు కార్యాలయాలు, ఆప్త కార్యదర్శులు లేకపోవడం విడ్డూరంగా ఉంది. రాయచూరు జిల్లాలో నలుగురు విధాన పరిషత్ సభ్యులు, నలుగురు శాసన సభ్యులున్నా ఏ ఒక్కరికీ మంత్రి పదవి లభించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో అంతర్గతంగా అసమ్మతి రగిలి పోతోంది. రాయచూరు జిల్లాలో సింధనూరు శాసన సభ్యుడు హంపనగౌడ బాదర్లి, కొప్పళ శాసన సభ్యుడు రాఘవేంద్ర హిట్నాళ్కు మంత్రి పదవి లభించక పోవడంతో రాయచూరు, కొప్పళ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యకర్తలు రాజీనామాలకు సిద్ధమయ్యారు. సీనియర్లు హంపనగౌడ బాదర్లి, బోసురాజుల మధ్య జరిగిన పోరులో మంత్రి పదవి చేజారినట్లు తెలుస్తోంది.
కల్యాణ కర్ణాటకలో ఇంచార్జిలు వీరే..
రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ వివిధ జిల్లాలకు ఇంచార్జి మంత్రులను నియమించారు. రాయచూరు జిల్లా ఇంచార్జి మంత్రిగా అజయ్ సింగ్, కలబుర్గి జిల్లాకు ప్రియాంక్ ఖర్గే, యాదగిరి జిల్లాకు శరణు ప్రకాష్ పాటిల్, కొప్పళ జిల్లాకు శివరాజ్ తంగడిగి, గదగ్ జిల్లాకు బసవరాజ రాయరెడ్డి, బీదర్కు ఈశ్వర్ ఖండ్రే, విజయపురకు ఎం.బీ.పాటిల్, బాగల్కోటెకు విజయానంద కాశప్పనవర్లను ఇంచార్జి మంత్రులుగా నియమించారు.
రాయచూరు, యాదగిరి,
విజయనగరలకు నో ఛాన్స్
23 ఏళ్లుగా ఆ జిల్లాల్లో
ఇతర జిల్లాల నేతలదే పెత్తనం


