హుబ్లీ: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన ఘటనలు జంట నగరాల్లో చోటు చేసుకున్నాయి. పొలానికి వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడిన ఘటన కుందగోళ తాలూకా హిరేహరకుణి గ్రామం వద్ద చోటు చేసుకుంది. ఘటనలో ఆ గ్రామానికి చెందిన తిప్పణ్ణ కురహట్టి(45) మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారిలో ఇద్దరిని బెళగావి ఆస్పత్రికి, మరొకరిని హుబ్లీ కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బసవరాజ్, అశోక్, ప్రవీణ్, రామన్న, మహేష్, మల్లప్ప, చేతన్, మంజునాథ్ గాయపడ్డారు. ఉదయం పొలానికి 10 మందితో కలిసి ట్రాక్టర్లో వెళుతుండగా హుక్ కట్ అయి అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. ఘటనపై కుందగోళ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
నీటి ట్యాంకర్ బోల్తా.. ఒకరు మృతి
మరో ఘటనలో డ్రైవర్ అదుపు తప్పి నీటి ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన కోళివాడ శివారులో జరిగింది. బాగలకోటె జిల్లా బీళగి తాలూకా సిద్దాపురకు చెందిన ప్రసాద్ (28) మృతుడు. ట్రాక్టర్ ద్వారా నీటి ట్యాంకర్ తీసుకెళుతుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ట్యాంకర్ అతడిపై పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
లారీ ఢీకొని బైకిస్టు మృతి
మరో ఘటనలో ధార్వాడ గుళేదకొప్ప గ్రామం వద్ద జాతీయ రహదారిలో బైక్, లారీ ఢీకొనగా బైక్ చోదకుడు మృతి చెందాడు. గుళేదకొప్ప గ్రామానికి చెందిన హనుమంత(65) మృతుడు. బెళగావి నుంచి గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ యూపీ రాహుల్ కుమార్ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టినట్లు గరగ పోలీసులు తెలిపారు.
నగదు బదలాయించుకుని రూ.లక్షల్లో మోసం
హుబ్లీ: బ్యాంక్ ఖాతా నుంచి అక్రమంగా రూ.6.67 లక్షలు బదలాయించుకుని సైబర్ కేటుగాళ్లు వంచించారని బాధితురాలు, గోకుల్ రోడ్డు నివాసి అక్కమహాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంచకులు డెబిట్ కార్డు సెట్టింగ్ను మార్చి యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును బదలాయించుకుని వంచించినట్లు బాధితురాలి భర్త రవీంద్ర నాథ్ తెలిపారు.
జీవనశైలి మార్పుతో
మెదడుకు ఆరోగ్యం
● డీహెచ్ఓ డాక్టర్.టి.లింగరాజు
హొసపేటె: మానవ శరీరానికి మెదడు నియంత్రణ కేంద్రం. మెదడులో సమస్య వస్తే అది కేవలం వ్యక్తి ఆరోగ్యాన్నే కాకుండా మొత్తం కుటుంబం ఆర్థిక, మానసిక శ్రేయస్సును కూడా ప్రభావితం చేస్తుందని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్.టి.లింగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని ప్రభుత్వ 100 పడకల ఆస్పత్రిలో నిర్వహించిన ప్రపంచ మెదడు దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, రక్తపోటు, మధుమేహం, వ్యసనాలు, సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేదా వ్యాయామం లేక పోవడం వంటి కారణాల వల్ల మెదడు సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయన్నారు. పక్షవాతం, మెదడు రక్తస్రావం, నాడీ మండల బలహీనత, మతిమరుపు వంటివి సర్వసాధారణం అవుతున్నాయని ఆయన అన్నారు. సకాలంలో ఈ వ్యాధికి చికిత్స పొందడం, అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం అని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ దిశాంత్, జిల్లా లెప్రసీ కంట్రోల్ అధికారి డాక్టర్ కే రాధిక, జిల్లా ఆర్సీహెచ్ అధికారి డాక్టర్ జంబయ్య, జిల్లా ఆరోగ్య విద్యాశాఖాధికారి దొడ్డమని, డాక్టర్ భరత్, డాక్టర్ సతీష్ చంద్ర, డాక్టర్ ఫసియుద్దీన్, డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ సిద్దలింగప్ప, డాక్టర్ ఆశా కోరి, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.


