సాక్షి,బళ్లారి: జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్షణం బళ్లారి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ధర్నా చేపట్టి, జిల్లా యంత్రాంగానికి వినతిపత్రం సమర్పించింది. రెండు రోజులుగా జిల్లాధికారి కార్యాలయం ముందు జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో పలువురు బీజేపీ ప్రముఖులు పాల్గొని నిరసన, ధర్నా చేపట్టారు. మంగళవారం మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, విధాన పరిషత్ సభ్యుడు వై.ఎం.సతీష్, బీజేపీ అధ్యక్షుడు అనిల్కుమార్ మోకా తదితరుల బృందం ఽజిల్లాధికారి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
కరువుతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు
కరువు పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వర్షాలు రాకపోవడంతో పెట్టిన పంటలు పూర్తిగా ఎండిపోయాయన్నారు. చాలా మంది రైతులు పంట పెట్టుకోలేక దుక్కులు దున్ని భూములను బీళ్లుగా వదిలేశారన్నారు. వర్షాలు జాడలేకపోవడంతో సమస్యలు తీవ్రతరం అవుతున్నాయన్నారు. వెంటనే బళ్లారి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి సహాయ చర్యలు చేపట్టాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఒక ఎకరాకు రూ.50 వేలు పరిహారం అందించాలని, తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
గోశాలల ప్రారంభానికి పిలుపు
పశువులకు మేత లేక రైతాంగం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, వెంటనే పశువులకు మేత అందించేందుకు గోశాలలను తెరవాలన్నారు. పశువులకు మేతతో పాటు తాగునీటి సమస్య కూడా ఉన్నందున తుంగభద్ర నదికి నీరు విడుదల చేయాలన్నారు. తీవ్ర కరువు పరిస్థితులు జనం ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించేందుకు మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. వ్యవసాయ కూలీలు వలసలు వెళ్లకుండా ఆపాలన్నారు. స్థానికంగానే ఉపాధి కల్పించాలన్నారు. బీజేపీ జిల్లా నాయకులు, రైతు మోర్చా, మహిళా మోర్చా పదాధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఒక ఎకరాకు రూ.50 వేల చొప్పున
పరిహారం అందించాలి
వెంటనే తుంగభద్ర నదికి నీరు
విడుదల చేయాలి
బీజేపీ నేతల ధర్నా,
జిల్లా యంత్రాంగానికి వినతి


