హొసపేటె: గత మూడేళ్లలో అన్నభాగ్య, గృహజ్యోతి, శక్తి యోజన, యువనిధి పథకాల కింద జిల్లాలోని అర్హులైన లబ్ధిదారులకు రూ.2,944 కోట్లు పంపిణీ చేసినట్లు కర్ణాటక రాష్ట్ర గ్యారంటీ పథకాల అమలు కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి పీటీ పరమేశ్వర నాయక్ తెలిపారు. సోమవారం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నభాగ్య, గృహలక్ష్మి, గృహజ్యోతి, యువనిధి శక్తి యోజనలను అమలు చేసినట్లు వెల్లడించారు. ఈ పథకాల్లో లోపాలను సరిదిద్ది, వాటిని మరింత సమర్థవంతంగా అమలు చేసి, అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అన్నభాగ్య యోజన కింద ఆగస్టు 2023 నుంచి డిసెంబర్ 2024 వరకు జిల్లాలోని సుమారు 3.47 లక్షల కుటుంబాలకు డీబీటీ ద్వారా రూ.285 కోట్లు నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. ఆ తర్వాత లబ్ధిదారులకు డబ్బుకు బదులుగా 5 కేజీల చొప్పుల రేషన్ బియ్య పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. జిల్లాలో మొత్తం 2,03,766 ప్లాంట్లను సర్వే చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇందులో 1,35,311 ప్లాంట్లను సర్వే చేసి 66.40 శాతం పురోగతిసాధించినట్లు వెల్లడించారు. ఈ పునః సర్వే ప్రక్రియలో వాణిజ్య పన్ను, ఆదాయపు పన్ను, రాష్ట్రం వెలుపల ఉన్న లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఈ పథకాన్ని అందజేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా హామీ పథకం అమలు కమిటీ చైర్మన్ కే.శివమూర్తి, వైస్ చైర్మన్ బడవాలి, హడగలి శాంతనగౌడ, చంద్రప్ప జిల్లా పంచాయత్ ముఖ్య ప్రణాళికా అధికారి అన్నదాన స్వామి పాల్గొన్నారు.


