బళ్లారిఅర్బన్: లిడ్కర్ బెళగావి జిల్లా సమన్వయకర్త రుద్రేశి, హావేరి జిల్లా సమన్వయకర్త కృష్ణప్ప పదవీవిరమణ సందర్భంగా బెంగళూరులోని లిడ్కర్ ప్రధాన కార్యాలయంలో వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రగి నాగరాజ్ మాట్లాడుతూ రుద్రేశి 41 సంవత్సరాల 6 నెలలకు పైగా సంస్థకు అందించిన సేవలు అరుదైనవని కొనియాడారు. కృష్ణప్ప కూడా విధి నిర్వహణలో నిబద్ధతతో పని చేసి సహచరుల అభిమానాన్ని, ప్రజల విశ్వాసాన్ని పొందారని ప్రశంసించారు. పదవీ విరమణ ఉద్యోగానికే తప్ప సేవకు కాదన్నారు. సమాజానికి చేసిన సేవ, ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పే వ్యక్తి అసలైన గుర్తింపు. మానవత్వమే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి గొప్ప సంపద అని ఆయన పేర్కొన్నారు. లిడ్కర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్.నటరాజ్ మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన ఇద్దరు అధికారుల సేవలు సంస్థ అభివృద్ధికి విశేషంగా దోహదపడ్డాయన్నారు. వారి అనుభవం, క్రమశిక్షణ భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో లిడ్కర్ సీనియర్ అధికారులు మోనప్ప కట్టిమని, ప్రాణేష్, సిబ్బంది, తోలు కళాకారులు, మీడియా ప్రతినిధులు పాల్గొని పదవీ విమరణ చేసిన అధికారులను ఘనంగా సన్మానించారు.
ఉద్యోగుల
పదవీ విరమణ
రాయచూరు రూరల్: ప్రభుత్వ ఆధీనంలో విధులు నిర్వహించే ప్రతి ఒక్క ఉద్యోగి, అధికారులు, సిబ్బంది పదవీ విరమణ సహజం అని, ఆయా శాఖలకు తాము చేసిన సేవలు మరువరానివని జిల్లా వార్త శాఖ అధికారి సురేష్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం కన్నడ భవన్లో సినిమా ప్రదర్శన ఉద్యోగి ప్రకాష్ పదవీ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రామాణికతతో విధులు నిర్వహించినప్పుడే ఆ శాఖకు ఉన్న సంబంధాలు నిరూపితమవుతాయన్నారు. రాయచూరు సంపాదకుడు అరవింద కులకర్ణి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో శాఖ పరంగా చేపట్టిన ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రచారానికి వెళ్లే ప్రకాష్ సేవలు అనన్యం అన్నారు.
అగ్నిప్రమాదం..
రూ.లక్షల్లో నష్టం
రాయచూరు రూరల్: నగరంలోని బంగికుంటలో పూజ సామగ్రి విక్రయించే దుకాణానికి నిప్పంటుకుంది. శనివారం తెల్లవారు జామున ఈ దుర్ఘటన జరిగినట్లు సదర్ బజార్ పోలీస్ స్టేషన్ సీఐ దాదావలీ వెల్లడించారు. తెల్లవారు జామున జరిగిన ఘటన కావడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందని ప్రాథమిక నివేదికలో వెల్లడించినట్లు తెలిపారు. దాదాపు రూ.50 లక్షలకు పైగా నష్టం సంభవించిందని అగ్నిమాపక అధికారి తెలిపారు.
ఇంజనీర్పై చర్యలకు వినతి
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువకు తాగునీటి అవసరాల కోసం వదిలిన నీటిని సాగు నీటి అవసరాల కోసం వదులుతున్న సిరవార డివిజన్ ఇంజనీర్ విజయలక్ష్మి పాటిల్పై చర్యలు తీసుకోవాలని కరవే డిమాండ్ చేసింది. శనివారం తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రామన్న మాట్లాడారు. వర్షాకాలంలో నీరు లేక ఇబ్బంది పడుతుండగా ఇంజనీర్ తాగునీటి చెరువును నింపకుండా సాగునీటికి విక్రయిస్తున్నారని, ఆమైపె చర్యలు చేపట్టాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రాన్ని సమర్పించారు.
సెప్టెంబర్ 12న
జాతీయ లోక్ అదాలత్
హుబ్లీ: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికారం ఆదేశాల మేరకు ధార్వాడ జిల్లాలోని అన్ని కోర్టుల్లో సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ ఏర్పాటు చేశారు. పాత కేసులు, రాజీ కోసం ఆసక్తి చూపే కేసులను ఎక్కువ సంఖ్యలో రాజీ ప్రక్రియ ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఈ విషయమై వాదులు, ప్రతివాదులు అవగాహన పెంచుకొని లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి అళ్లప్ప బడిగేరి ఓ ప్రకటనలో కోరారు.


