హుబ్లీ: భారతీయ న్యాయాంగ వ్యవస్థలో తొలి సారిగా ధార్వాడ హైకోర్టు పీఠంలో శనివారం అరుదైన ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది. 10 మంది మహిళా న్యాయమూర్తులు ఇక్కడి అన్ని పీఠాల్లో కార్యకలాపాలను నిర్వహించారు. ఈ కార్యకలాపాల్లో 90 శాతం మహిళా న్యాయవాదులు, న్యాయాంగ అధికారులు విధి నిర్వహణ చేశారు. మూడు డివిజన్ బెంచ్లు, నాలుగు ఏకసభ్య ధర్మాసన పీఠాల్లో మహిళా న్యాయమూర్తులు విచారణ జరిపారు. నేరాలు, సివిల్ కార్మికులకు సంబంధించిన పిటిషన్లను ఆయా పీఠాల ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఆ 10 మంది మహిళా న్యాయమూర్తులు వీరే. డివిజన్ బెంచ్లో జస్టిస్ అను శివరామన్, జస్టిస్ కేజీ శాంతి, జస్టిస్ జ్యోతి ఎం., జస్టిస్ పీ.శ్రీసుధ, జస్టిస్ లలితా కన్నెగంటి, జస్టిస్ కేఎస్ హేమలేఖల ఆధ్వర్యంలో జరగగా ఏకసభ్య ధర్మసనాల్లో జస్టిస్ డాక్టర్ సీహెచ్ సుమలత, జస్టిస్ తారా వితస్తగంజు, జస్టిస్ గీతా కేవీ, జస్టిస్ రాజేశ్వరి హెగ్డే అధ్యక్షత వహించారు.
గతనెల 24న ప్రత్యేక రోస్టర్ నోటిఫికేషన్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ధార్వాడ న్యాయవాదుల సంఘం గత మార్చిలో ప్రధాన న్యాయమూర్తి విభు బకృకు విజ్ఞప్తి చేయడంతో స్పందించిన ఆయన గతనెల 24న ప్రత్యేక రోస్టర్ నోటిఫికేషన్ వెల్లడించారు. సుప్రీం కోర్టు లేక కేరళ హైకోర్టుల్లో 1, 2 మహిళా న్యాయపీఠాలు సాంకేతికంగా ఏర్పాటయ్యాయి. మొత్తం ధర్మాసనాలున్న 7 పీఠాల్లో మహిళా న్యాయమూర్తులతో కార్యకలాపాలు జరగడం ఇదే తొలిసారి. సివిల్, క్రిమినల్, అప్పీల్, రిట్, కుటుంబ, పన్నులు, సేవ విషయాల్లో మహిళా న్యాయమూర్తులతో విచారణ జరిగింది. న్యాయనిపుణుల ప్రకారం మహిళలు సంక్లిష్ట న్యాయ విషయాలను నిర్వహించడానికి సమర్థులన్న బలమైన సందేశం శనివారం నాటి హైకోర్టు మహిళా న్యాయమూర్తులతో సమాజానికి సరికొత్త స్పూర్తిదాయకమైన సందేశం ఉంది. కర్ణాటక హైకోర్టు ధార్వాడ పీఠంలో మొత్తం 7 న్యాయ పీఠాలు ఉండగా వీటిలో మూడు డివిజన్ బెంచులు, నాలుగు సింగిల్ బెంచ్ పీఠాలు. శనివారం ఈ అన్ని 7 పీఠాల్లో మహిళా న్యాయమూర్తులే అధ్యక్షత వహించారు. డివిజన్ బెంచ్లో తలో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు, సింగిల్ బెంచ్లో ఓ మహిళా న్యాయమూర్తి విచారణ చేపట్టారని రోస్టర్ నోటిఫికేషన్లో వెల్లడించారు.
10 మంది మహిళా న్యాయమూర్తులతో ఏడు పీఠాల్లో న్యాయదానం


