బాలికను కాటేసిన జింక బొమ్మ | - | Sakshi
Sakshi News home page

బాలికను కాటేసిన జింక బొమ్మ

Jan 31 2024 1:14 AM | Updated on Jan 31 2024 10:57 AM

- - Sakshi

కర్ణాటక: శివమొగ్గ నగరంలో డ్రైనేజీ కాలువపై నిలబడి ఉండగా స్లాబు కూలి వ్యక్తి మరణించిన సంఘటన మరువక ముందే మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ముద్దనకొప్పలో ఉన్న ట్రీ పార్క్‌లో సిమెంటు జింక బొమ్మపై కూర్చుని బాలిక ఆడుకుంటుండగా జింక విరిగిపడి బాలిక నిమిషాల్లోనే మరణించింది.

వాకింగ్‌ వస్తే..
వివరాలు.. గాంధీ బజార్‌ రోడ్డులో బట్టల షాపు యజమాని అయిన హరీష్‌ అంబోరె, లక్ష్మీ దంపతుల కుమార్తె సమీక్ష (6), లక్ష్మీ, కూతురుతో కలిసి ఆదివారం సాయంత్రం పార్క్‌కు వాకింగ్‌ కోసం వచ్చారు. ఈ సమయంలో సమీక్ష అక్కడ ఉన్న జింక బొమ్మపై కూర్చుంది. ఇంతలో ఆ బొమ్మ కూలిపోవడంతో కిందపడ్డ సమీక్ష తీవ్ర గాయాలపాలైంది. హఠాత్‌ పరిణామంతో లక్ష్మీ కేకలు వేస్తూ కూతురిని మెగ్గాన్‌ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆమె చేతుల్లో చిన్నారి కన్నుమూసింది.

కలెక్టరేట్‌ ముందు నిరసన
ఈ నేపథ్యంలో మంగళవారం భావసార క్షత్రియ మహాజన సమాజం నేతలు కలెక్టరేట్‌ ముందు నిరసన తెలిపారు. పార్కులో నాసిరకం నిర్మాణాలే ఈ ఘోరానికి కారణమని, అనేక బొమ్మలు శిథిలమైనట్లు తెలిపారు. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదన్నారు. చేయని తప్పుకి బాలిక చనిపోయిందని, ఆ కుటుంబానికి పరిహారం అందజేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సుమారు పాతిక ఎకరాల్లో ఉన్న పార్కును అటవీశాఖ పర్యవేక్షిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement