కరీంనగర్అర్బన్: ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించగా డీఆర్వో స్వామి, వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 225 అర్జీలు రాగా, అత్యధికంగా కరీంనగర్ నగరపాలక సంస్థకు 58, గృహ నిర్మాణ శాఖకు 56 దరఖాస్తు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమాన్ని సీఎం క్యాంపు కార్యాలయం, చీఫ్ సెక్రటరీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, 30 రోజులు దాటిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలన్నారు. పింఛన్ల దరఖాస్తు సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి పంచాయతీ, మండల కేంద్రం, మున్సిపాలిటీల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. కొత్త పింఛన్ల దరఖాస్తుకు ఆహార భద్రత కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు వివరించారు. గతంలో గ్రామ, వార్డుసభలు, ప్రజాపాలన వారోత్సవాల సమయంలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అధికారులు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తిస్తారని పేర్కొన్నారు.


