పిట్లం/బాన్సువాడ రూరల్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పిట్లం మండలంలోని చెరువులలోకి నీళ్లు చేరాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీటితో మండలంలోని పలు చెరువులు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతోంది. రైతులు పొలాల పనులలో బిజీగా ఉన్నారు. బాన్సువాడ మండలం పోచారం, తాడ్కోల్ గ్రామాల చెరువు అలుగులు పొంగిపొర్లుతున్నాయి. కోనాపూర్ గ్రామ చెరువు తూములను శుక్రవారం సర్పంచ్ కిష్టవ్వ గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. తాడ్కోల్ చెరువు పూర్తిస్థాయిలో నిండటంతో తూము ద్వారా నీటిని సర్పంచ్ అందె రమేష్ కిందికి వదిలారు.
సంఘమేశ్వర్లో గండిని పూడ్చిన రైతులు
దోమకొండ: మండలంలోని సంఘమేశ్వర్ గ్రామ శివారులో గౌరవానిచెరువు మత్తడి కాలువకు గురువారం భారీ వర్షాలకు గండి పడి, పొలాల్లోకి నీరు చేరింది. శుక్రవారం రైతులు ఇసుక బస్తాలు, రాళ్లు, కంకరతో నింపిన బస్తాలను అడ్డుగా వేసి గండిని పూడ్చారు. సమస్యను ఇరిగేషన్ శాఖ అధికారులకు తెలిపిన పట్టించుకోలేదని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు.


